వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగుతోందని టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ గల్లా జయదేవ్, ఎంపీ రామ్మోహన్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనుభవం ఉన్న పనబాక లక్ష్మిని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. వైసీపీ అరాచకపాలనను అడ్డుకునే అవకాశం తిరుపతి ఓటర్లకు వచ్చిందన్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే..కనీసం పరామర్శ చేయకుండా ఆ కుటుంబాన్ని అవమానించారన్నారు. దళితులపై జగన్కు చిన్నచూపు ఉందని, ప్రజలకు సేవ చేసే వారే ఎన్నికల్లో గెలవాలని, జగన్కు తనకు సేవ చేసేవారే కావాలని వ్యాఖ్యానించారు. పార్లమెంటు రికార్డులు చూస్తే..ఏ పార్టీ ఎంపీలు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడారో తెలుస్తుందన్నారు. ఓట్లు కావాల్సినప్పుడు ప్రత్యేక హోదాను వాడుకున్న వైసీపీ..ఇప్పుడు మౌనంగా ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చివరికి ఏపీలో ముఖేష్ అంబానీ హ్యాండ్ సెట్ తయారీ సంస్థను పక్కన పెట్టారని, రెండేళ్లలో ఏపీకి ఏం వచ్చిందో , ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పాలన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగుపెట్టేందుకే జగన్ భయపడుతున్నారన్నారు. ప్రస్తుతం 21మంది ఎంపీలున్నా వైసీపీ సాధించిందేమీ లేదన్నారు.
తిరుపతి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి..
ఇక ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘టీడీపీ అభ్యర్థిగా ఉన్న పనబాక లక్ష్మి సామాజిక సేవాభావంతో ఉన్న వ్యక్తి. తిరుపతి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. టీడీపీ రానున్న కాలంలో మరింత బలపడుతోంది. యువనేత నారా లోకేష్ సారథ్యంలో పార్టీ మరింత పటిష్టం అవుతోంది. ఎంపీ అనే వ్యక్తి పార్లమెంటు వ్యవస్థలో కీలకంగా ఉంటుంది. పార్లమెంటులో చట్టం ద్వారా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవాలంటే ఎంపీలు పోరాడాలి. టీడీపీ హయాంలో ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడాం. అప్పటికీ చాలాసార్లు కేంద్రం పలు కారణాలు తెరపైకి తెచ్చింది. అయినా టీడీపీ వెనక్కి తగ్గలేదు. అప్పట్లోనే మోదీతో పెట్టుకోవద్దని చాలా మంది చెప్పారు. కాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేందుకే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మెడలు వంచి ప్రత్యక హోదా తెస్తామని చెప్పారు. టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న జగన్ తనకు 25సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చారు. 22మంది ఎంపీలను ఏపీ ప్రజలు గెలిపిస్తే..రెండేళ్లైనా జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ లాంటి పదాలు మాట్లాడేందుకు జగన్ భయపడుతున్నారు. కేంద్రంతో లాలూచీ పడి..లాబీయింగ్ చేస్తున్నారు. 20నెలల్లో గట్టిగా మాట్లాడిన సందర్భం లేదు.
తిరుపతి తీర్పు జగన్కి సమాధానంగా ఉండాలి..
టీడీపీ తరఫున ముగ్గురమే ఉన్నా..విశాఖ స్టీల్ ప్లాంట్పై లోక్సభలో నిలదీశాం. వైసీపీ ఎంపీలు ఏ ఒక్క విషయాన్ని కూడా పార్లమెంటులో మాట్లాడలేకపోతున్నారు. తిరుపతిలోనే బైపోల్ వచ్చినందుకు వెంకన్న ఆశీస్సులుంటాయి. తిరుపతి తీర్పు జగన్కి సమాధానంగా ఉండాలి. ఏపీ బాగుపడాలంటే.. టీడీపీకి ఓటు వేయాలి. తిరుపతి ప్రగతి విషయంలోనూ వైసీపీ అన్యాయయం చేసింది. తిరుపతికి ఐఐటీతోపాటు పలు కంపెనీలను టీడీపీ మొదలు పెట్టింది. వైసీపీ వచ్చాక ఒక్క ఎంపీ కూడా నిధులు అడగకపోగా ఒక్కలేఖ కూడా రాయడం లేదు. తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందన్న భయంతోనే జగన్ ఇంటింటికీ లేఖలు రాస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ దివాళా తీనే పరిస్థితి ఉంది. దేశంలో ధరలు పెరుగుదల ఏపీలోనే ఎక్కువగా ఉంది. జగన్ అసమర్థ పాలనే ఇందుకు నిదర్శనం. సంపద సృష్టి తెలివి లేక ఆస్తులు అమ్మే పరిస్థితి వచ్చింది. లిక్కర్ వ్యాపారం పెరిగింది. ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు కనుమరుగవుతాయి. విశాఖలో పెట్టుబడుల కోసం పెట్టుకున్న భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఇలాగే కొనసాగితే.. తిరుపతిలో ఉన్న భూములతో పాటు ఏడుకొండలనూ అమ్మేస్తాడు. జగన్ అలాంటి మూర్ఖుడు. దీన్ని అడ్డుకోకపోతే రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నట్లే. పుదుశ్చేరిలో బీజేపీ ప్రత్యేక హోదాను మేనిఫెస్టోలో పెట్టింది. దీనిపై వైసీపీ ఎందుకు ప్రశ్నించడం లేదు. వైసీపీ ఎంపీలు బీజేపీ తరఫున పుదుశ్చేరిలో ప్రచారం చేస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో జగన్ దారుణమైన రాజకీయం చేస్తున్నారు. వైసీపీ డబ్బులు పంచడంతోపాటు వలంటీర్లనను వాడుకుని, ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీలో జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. మార్పు కనిపిస్తోంది. తిరుపతి తీర్పే అందుకు నిదర్శనం కావాలి. టీడీపీ ముగ్గురు సభ్యులే ఉన్నా లోక్సభలో ప్రశ్నిస్తున్నాం. అయితే లోక్ సభలో 5నిమిషాలే మాట్లాడే సమయం ఉంటుంది. మరో సభ్యుడు గెలిస్తే..మరింత సయయం ఉంటుంది. తమకు 5నిమిషాల అదనపు సమయం ఉంటుందని, ఏపీ ప్రయోజనాలు కాపాడుకోవచ్చని వ్యాఖ్యానించారు.
Must Read ;- తిరుపతిలో వైసీపీకి అంత ఈజీ కాదు.. 14న జగన్ ఎన్నికల ప్రచారం