తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి రోజుకో కొత్త అప్ డేట్ వస్తోంది. ఇప్పటికే ఆ సీటును దక్కించుకునేందుకు ఆ స్థానానికి రాజీనామా చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ పక్క తనదైన శైలి వ్యూమాలకు పదును పెడుతుంటే.. మరోవైపు అధికార పార్టీ బలమేంటో మరోమారు నిరూపించాలని టీఆర్ఎస్ అంతకుమించిన వ్యూహాలను రచిస్తోంది. ఇక రేవంత్ రెడ్డి రాకతో కదనోత్సహంతో కదులుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ గట్టి పోటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తామూ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తామంటూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో హుజూరాబాద్ బరిని ట్రయాంగిల్ ఫైట్ నుంచి నాలుగు స్తంభాలాటగా ఆయన మార్చేశారు.
సారేమన్నారంటే..
ఈ సందర్భంగా కోదండరాం ఏమన్నారంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేయనుంది. ఆగస్టు నెలాఖరులో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నాం. టీజేఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఏ పార్టీలోనూ తమ పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో ప్రభుత్వం చెప్పాలి* అంటూ ఆయన డిమాండ్ చేశారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించిన కోదండరాం సంచలనమే రేపారు.
నాలుగు స్తంభాలాటేనా?.. అంతకుమించా?
ఇదిలా ఉంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు ఇప్పుడు టీజేఎస్ కూడా బరికి సిద్ధపడుతోంది కదా. ఈ పోటీకి ఈ పార్టీలతోనే సరిపెట్టుకోవాలా?.. లేదంటే షర్మిల ఆధ్వర్యంలో కొత్తగా బరిలోకి దిగిన వైఎస్సార్టీపీ కూడా హుజూరాబాద్ బరిలోకి దిగుతుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ పోటీకి షర్మిల పార్టీ కూడా సిద్ధమేనని ప్రకటిస్తే.. నాలుగు స్తంభాలాటలను మించిన పోటీ తప్పదు. టీజేఎస్ తో పాటు వైఎస్సార్టీపీ కూడా ఎంతో కొంత ఓట్లను అయితే చీలుస్తుంది కదా. మరి ఈ పరిణామం ఏ పార్టీకి దెబ్బేస్తుందో చూడాలి.
Must Read ;- రెండేళ్లలో కాంగ్రెస్ కు అధికారమే లక్ష్యం: రేవంత్











