వై.విజయ .. నిన్నటితరం ప్రేక్షకులలో ఈ పేరు తెలియనివారు ఉండరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె అనేక చిత్రాల్లో నటించారు. కవ్వించే .. నవ్వించే పాత్రలకు ఒకప్పుడు ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లోని కథానాయకులందరి సినిమాల్లోను ఆమె కనిపించారు. గ్లామర్ గా .. గడుసుగా కనిపిస్తూ ఆమె చేసిన పాత్రలే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తాజాగా ఆమె ‘ఆలీతో సరదాగా‘ కార్యక్రమంలో మాట్లాడుతూ తన గురించిన విషయాలను చెప్పుకొచ్చారు.
“మా అమ్మానాన్నలకు మేము పది మంది సంతానం. ఆడపిల్లలు ఆరుగురు .. మగపిల్లలు నలుగురు. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించింది. సినిమాల్లో డాన్స్ చేసే అమ్మాయిలు కావలసి వస్తే, మా స్కూల్ కి వచ్చి నన్ను తీసుకెళ్లేవారు. 13 ఏళ్లకే నేను హీరోయిన్ ను అయ్యాను. శోభన్ బాబు హీరోగా వచ్చిన ‘తల్లిదండ్రులు’ సినిమాలో చేశాను. ఆ తరువాత కథానాయికగా 15 సినిమాల వరకూ చేశాను. తమిళంలో కమల్ .. రజనీ .. శివాజీ గణేశన్ .. ఎంజీఆర్ ఇలా అందరితో కలిసి నటించాను.
తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా చేశాను. ఆ సినిమాలో నేను పోషించిన ‘పులుసు’ పాత్రకి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తరువాత నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా విడుదలైన దగ్గర నుంచి మా ఇంట్లో ఫోన్ అలా మోగుతూనే ఉండేది. అప్పటి నుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో నేను నటించినప్పటికీ, తెలుగులో వచ్చిన అవకాశాల కారణంగానే లైఫ్ లో సెటిల్ అయ్యాను. ఆ సినిమా షూటింగు సమయంలోనే నా పెళ్లి జరగడం నేను మరిచిపోలేని మరో తీపిగుర్తు” అంటూ చెప్పుకొచ్చారు.
Must Read ;- ఫ్యాన్స్ ని మోసం చేసిన రెజీనా. ఇంతకీ.. ఏమైంది.?