అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో ప్రధానమైన ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలతో పాటు ప్రధాన మీడియాను కూడా టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా మరో నిర్ణయాన్ని వెలువరించారు. తన సొంతంగా సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసుకునే ఆలోచన ఉందని, వేరే మాధ్యమాలతో చర్చలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇక రెండురోజుల క్రితం జరిగిన ఘటనతో ట్విట్టర్ కి, ట్రంప్ కి మధ్య వార్ తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్ష భవనం వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో వివాదాస్పద ట్వీట్ లు చేయడంతో ట్విట్టర్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాను బ్లాక్ చేసింది. దీంతో ట్రంప్ తన అధికారిక ఎకౌంట్నుంచి మరో ట్వీట్ చేశారు. వివాదాస్పదంగా ఉన్నాయనే కారణంతో కొన్ని ట్వీట్ లను ట్విట్టర్ తొలగించింది. మరికొన్నింటికి హెచ్చరికను జారీచేసింది. ట్రంప్ కి సంబంధించిన మరో అకౌంట్ ని కూడా బ్లాక్ చేసింది. దీంతో ట్రంప్ మరోసారి సోషల్ మీడియా, మీడియాపై ద్వజం ఎత్తారు.
మీడియా అండతో గెలిచి.. అదే మీడియాపై వార్..
వాస్తవానికి 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, ట్రంప్ పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తొలుత ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెప్పాయి. అయితే అనూహ్యంగా ఈమెయిల్ వివాదంలో ఇరుక్కున్నారు. 2009 నుంచి 2013 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ మెయిల్ ఐడీ కాకుండా ప్రైవేటు మెయిల్ ఐడీ వాడారన్న ఆరోపణ వచ్చింది. సొంత సర్వర్లు వాడడం, సదరు మెయిల్స్ కి సంబంధించిన డాక్యుమెంట్ల ప్రింటింగ్ భాద్యతను ఫిలిపైన్స్ కి చెందిన తన సహాయకురాలికి అప్పగించడంతో భద్రతాపరమైన సమస్యలు వచ్చే పరిస్థితి తలెత్తిందని, అధికారిక రహస్యాలు బయటకు వెల్లడయ్యే పరిస్థితి కనిపించిందని ఆ ఆరోపణల సారాంశం.
దీంతో ఎఫ్ బీ ఐ విచారణ ను హిల్లరీ క్లింటన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే ట్రంప్ పై అవినీతి ఆరోపణలు ఉన్నా.. ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తన నెట్ వర్క్ తో అమెరికన్లలోకి హిల్లరీ క్లింటన్ వ్యవహారాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు. అంతేకాకుండా జాతీయవాదాన్ని అమెరికన్ ఫస్ట్ నినాదాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే తీసుకెళ్లారు. దీంతో అమెరికన్లు ఆయనను గెలిపించారు. అప్పటివరకు బాగానే ఉన్నా.. తరువాత ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియా టార్గెట్గా పలు వ్యాఖ్యలు చేశారు. పలు చర్యలూ ప్రారంభించారు. మీడియాను అమెరికా ప్రజల శత్రువుగా అభివర్ణించారు ట్రంప్.
గత ఏడాది మేలో ఓ కీలక ఉత్తర్వు జారీచేశారు. వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్ను సామాజిక మాధ్యమాలు మార్చినా, నిషేధించినా, లేబుల్స్ అంటించినా.. వాటిపై చర్యలు తీసుకునే హక్కు.. అమెరికా ప్రభుత్వానికి ఉండేలా ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పుడు ఆయన ‘అమెరికా ప్రజల హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చ తదితర అంశాలను తెరపైకి తెచ్చారు. ట్విట్టర్ లాంటి సంస్థలు తటస్థులమని చెబుతూనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దీంతో సోషల్ మీడియా దిగ్గజాలన్నీ ఒకే తాటిపైకి రావాల్సి వచ్చింది. కొవిడ్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ట్రంప్ సరైన విధంగా వ్యవహరించలేదని ఫేస్ బుక్ కూడా వ్యాఖ్యానించడంతో ట్రంప్ మరింత రెచ్చిపోయారు.
అధ్యక్ష ఎన్నికల్లో ముదిరిన వివాదం..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకంటే ముందే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు కంటెంట్ చెకింగ్ విధానాన్ని తీసుకొచ్చాయి. అభ్యంతరకరమైన, హింసను ప్రేరేపించే విధంగా ఉన్న సమాచారాన్ని (కంటెంట్ ని) బ్లాక్ చేయడం, హెచ్చరికలు ఉంచడం ప్రారంభించాయి. మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓట్ బై మెయిల్ విషయంలో మోసాలు జరిగే అవకాశం ఉందని, రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని ట్రంప్ ట్వీట్ చేయగా, వాస్తవాలు తెలుసుకోవాలనే ఫ్యాక్ట్ చెక్ హెచ్చరికను ట్విట్టర్ ఆ ట్వీట్ కు యాడ్ చేసింది. దీంతో ట్రంప్ మరింత రెచ్చిపోయారు. ఇక ఆ మధ్య ఓ నల్లజాతీయుడిని పోలీసులు కాలితో తొక్కిన ఘటన విషయంలోనూ ట్రంప్ ట్వీట్ లను ట్విట్టర్ హెచ్చరికతో కూడిన ఫ్యాక్ట్ చెక్ ను జతచేసింది. దీంతో ట్రంప్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. మొత్తంమీద ఎలాంటి ప్రచార సాధనాలను వాడుకుని ట్రంప్ గెలిచారో.. వాటిపైనే యుద్ధం ప్రకటించారు. తాజాగా ఆయన ఎలాంటి వేదిక ద్వారా బయటకు వస్తారనేది చూడాలి.
Must Read ;- ఓటమిని అంగీకరించిన ట్రంప్ : 20న బైడెన్ ప్రమాణం