గ్రేటర్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. అధికార, బీజేపీ పార్టీల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. మీరెంతా.. అంటే మీరెంతా అనే కాడికి విమర్శలు తార స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్లో టీఆర్ఎస్-ఎంఐఎం సర్కారు వైఫల్యం చెందిందంటూ, గతంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు నురవేర్చలేదంటూ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. కుటుంబ పార్టీలు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం మేయర్ కావాలో.. బీజేపీ మేయర్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.
Also Read:-బలమైన నేతలకు బీజేపీ గాలం..!
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్ధానాలు, నెరవేర్చని వాగ్దానాలు చార్జ్ షీట్ రూపంలో బీజేపీ విడుదల చేసింది. అందులో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో మౌలికసదుపాయాల కోసం ఆరేండ్లలో రూ.67వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అంత గొప్పగా అభివృద్ధి జరిగితే రోడ్ల మీదకు నీళ్లెందుకు వచ్చాయి? వందల కాలనీలు నీట ఎందుకు మునిగాయి? అని ఛార్జ్ షీట్లో పొందుపర్చారు. ఆ 67 వేల కోట్ల రూపాయలకు లెక్కా పత్రముందా? అని ప్రశ్నించారు.
డల్లాస్ కాదు.. ఫ్లడ్ సిటీ…
లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లంటే 1100 గృహ ప్రవేశాలా? అని టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఒకే కుటుంబ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని హైదరాబాద్ను ఫ్లడ్ సిటీగా మార్చారన్నారు. వరదల్లో చిక్కుకుని ప్రజలు 15 రోజులు ఇబ్బందులు పడ్డారన్నారు. హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, గ్లోబల్ సిటీని ఫ్లడ్ సిటీగా మార్చారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం రూ.100 ఇస్తే అవి నేరుగా ప్రజల అకౌంట్లో పడ్డాయని, టిఆర్ఎస్ ఇచ్చిన రూ.10వేల సాయాన్ని మధ్యలోనే కొట్టేశారని ఆరోపించారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలాగా మారుస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఏంచక్కా ఫామ్ హౌజ్లో కూర్చున్నారని మంత్రి విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్రా చాలా ఉందని ఆయన చెప్పారు.
100 రోజుల ప్రణాళికలేవీ?..
గ్రేటర్లో గెలిస్తే వంద రోజుల ప్రణాళికను రూపొందించి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్న ప్రణాళికలు ఏమయ్యాయని బీజేపీ విడుదల చేసిన ఛార్జ్ షీట్లో పేర్కొన్నది. మూసీ నది అందాలు ఏమయ్యాయని పేర్కొన్నది. రూ.15వేలు, రూ.10వేల లోపు పన్ను చెల్లిస్తున్నవారందరికీ 50 శాతం మినహాయింపు అనేది ఎన్నికల్లో డ్రామాగానే చూడాలని తెలిపింది. రోడ్లంటే కేవలం రిబ్బన్ కటింగ్లు కాదని తెలిపింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రోడ్ల విస్తరణ పనులు చేపడతామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ ఆదివారం విడుదల చేసిన ఛార్జ్ షీట్లో పలు అంశాల గురించి పొందుపర్చింది.