తమిళనాడు రాజకీయాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అక్కడ ఖాతా తెరిచేందుకు బీజేపీ మాస్టర్ మైండ్ అమిత్ షా ఇవాళ చెన్నైలో పర్యటిస్తున్నారు. అన్నాడీఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్టు నటిస్తున్న బీజేపీ, డీఎంకే బహిష్కృత నేత అళగిరిని కూడా పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రముఖ నటి ఖుబ్భూ బీజేపీలో చేరిపోయారు. ఇక డీఎంకేలో అసంతృప్తితో ఉన్న నేతలను కూడా బీజేపీలోకి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
బీహార్ వ్యూహం తమిళనాడులో పనిచేస్తుందా?
తమిళనాడు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. స్థానిక పార్టీల నేతలు కాలు దువ్వుకున్నా, జాతీయ పార్టీలను మాత్రం ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. ముఖ్యంగా తమిళ ప్రజలు హిందీ భాషా వ్యతిరేకులన్న ముద్ర పడింది. ఉత్తరాది పార్టీల పెత్తనం కూడా ప్రజలు సహించలేరు. అందుకే దేశంలో చాలా రాష్ట్రాలకన్నా ముందే తమిళనాడులో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ తమిళనాడులో పిల్ల పార్టీల కిందే లెక్క. అక్కడ అన్నాడీఎంకే, డీఎంకే పోరు దశాబ్ధాలుగా సాగుతోంది. వారిలో ఎవరో ఒకరు అధికారంలో ఉంటూ ఉంటారు. ప్రజలు కూడా ఖచ్చితమైన తీర్పు ఇస్తూ వస్తున్నారు. ఏదో ఒక స్థానిక పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపిస్తూ ఉంటారు. డీఎంకే నేత కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరవాత తమిళ రాజకీయాలు చప్పగా మారాయి. ఇక అక్కడ రాజకీయాలను వేడి పుట్టించేందుకు బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేత అమిత్ షా చెన్నైలో పర్యటిస్తున్నారని తెలుస్తోంది.
Must Read ;- చిన్నమ్మ చిటికేస్తే పొలిటికల్ హీట్ పెరుగుతుందా?
బీజేపీ ఎవరితో జట్టుకడుతుంది?
తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో కలపి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రస్తుతానికి భావిస్తోందట. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతారా లేదా? బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేచే కమల్ హాసన్ ఎవరితో కలుస్తారు? ఇవన్నీ గమనిస్తున్న బీజేపీ అన్నాడీఎంకేతో ప్రస్తుతానికి చెలిమి కొనసాగిస్తోంది.
భవిష్యత్తులో ఎవరితో కలసి ఎన్నికలకు వెళుతుందనేని మాత్రం ఇప్పుడే చెప్పలేం. రజనీకాంత్ కదలికలపై కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ లోపుగా బీజేపీలో వాయిస్ వినిపించేందుకు కొందరు నేతలను చేర్చుకుంటున్నారు.
ఇందులో భాగంగా ప్రముఖ నటి ఖుబ్భూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక డీఎంకేలో ఒకప్పుడు నెంబర్ టూగా ఉన్న కరుణానిధి కుమారుడు అళగిరిని ఆ పార్టీ నుంచి స్టాలిన్ వెలివేశారు. దీంతో ఆయన కసితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. అలాంటి వారికి బీజేపీ ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది.
శశికళ విడుదలకు ముందుగా అమిత్ షా పర్యటన
పురుచ్చితళైవి, తమిళనాడు రాజకీయాలను రెండున్నర దశాబ్దాలపైగా శాసించిన జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్థుల కేసులో జైలు శిక్ష అనుభవించి త్వరలో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జయ ఆశయాలు నెరవేరుస్తానని ఆమె సమాధిపై శశికళ శపథం చేశారు. అమ్మ ఆశయాలు నెరవేర్చేందుకు శశికళ రంగంలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న బీజేపీ పెద్దలు తమిళనాడు ఎన్నికల్లో అనేక పార్టీలు పోటీ చేసే పరిస్థితిని కల్పిస్తోంది. దీని ద్వారా ఓట్ల చీలికలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. బీహార్ లోనూ ఈ వ్యూహంతో అధికారం కైవశం చేసుకున్నారు. మరి తమిళనాడులో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా? లేదా? అంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
Also Read ;- ఒరు సెయిది ఇప్పిడీ.. ఒరు సెయిది అప్పిడీ..