మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ.. ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ గ్రామీణ ప్రేమకథాచిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. విడుదలకు ముందు నుంచే మంచి బజ్ ఏర్పడిన ఈ సినిమా వేలెంటైన్స్ డే కు రెండు రోజులు ముందుగానే అంటే.. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని నిర్మాతలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఇటీవల ఉప్పెన ట్రైలర్ విడుదల చేశారు. యంగ్ టైగర్ యన్టీఆర్ ఆవిష్కరించిన ఈ సినిమా ట్రైలర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. మేనమామ రంగ ప్రవేశంతో ఉప్పెన కాస్తా మెగా ఉప్పెనగా మారింది.

.ఇంకా దర్శకుడు సుకుమార్, యంగ్ డైరెక్టర్ బాబీ, విలన్ గా నటించిన విజయ్ సేతుపతి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అలాగే.. ఈ ఈవెంట్ కు హీరో, హీరోయిన్స్ వైష్ణవ్ తేజ, కృతి శెట్టి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడికి తన ఆశీస్సులు అందజేసి.. సినిమా చరిత్రలో నిలిచిపోతుందని, దర్శకుడు బుచ్చిబాబు తన మేనల్లుడు వైష్ణవ్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టారని .. వైష్ణవ్ ఈ సినిమా తన డెబ్యూ మూవీయే అయినా అదరగొట్టాడని .. అలాగే అతడు తమ ఫ్యామిలీకే గర్వకారణమని చెప్పారు.
ఇక చిరంజీవి విజయ్ సేతుపతిని ఆకాశానికి ఎత్తేశారు. అతడు సైరాలో తాము పిలిచిన వెంటనే ఒక పాత్ర చేయడానికి అంగీకరించాడని, అతడు మంచి వ్యక్తని, ఇందులో అతడి నటన అద్భుతమని చెప్పారు. ‘ఉప్పెన’ సినిమాని తలచుకుంటే తనకు ‘ఆరాధన’ రోజులు గుర్తొస్తున్నాయని చిరంజీవి తన పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన టాలెంట్ ను ఎంతగానో పొగిడారు. సినిమా చూస్తుంటే.. తనకి తాను నటించిన ఆరాధన సినిమా గుర్తుకు వచ్చిందని, దర్శకుడు బుచ్చిబాబు భారతీరాజా తరహాలో ఈ సినిమాను తీర్చిదిద్దాడని చెప్పారు.
Also Read: చిరంజీవి చెప్పింది.. రజనీకాంత్ పాటించారా.?











