వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న దిశగా సచివాలయ వ్యవస్థను తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల పేరిట ఏర్పాటు అయిన ఈ కేంద్రాల్లో ఆయా విభాగాలకు చెందిన సేవలను ప్రజలకు త్వరితగతిన అందేలా చేసేందుకు సిబ్బందిని కూడా నియమించారు. ఈ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందుతోందని జగన్ సర్కారు జబ్బలు చరుచుకుంటోంది. అయితే క్షేత్రస్థాయిలో సచివాలయాల ద్వారా పెద్దగా పనులే కావడం లేదని, అంతటా అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని తాజాగా తేలిపోయింది. ఇదేదో జగన్ అంటే గిట్టని విపక్షాలు చెబుతున్న మాట కాదు. స్వయంగా జగన్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో సచివాలయాల తీరును పరిశీలించిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చెబుతున్న మాట. అంటే జగన్ ప్రారంభించిన కొత్త వ్యవస్థ పనితీరు బాగా లేదని, అక్రమాలకు అడ్డాగా మారిపోయాయని.. స్వయంగా జగన్ చేయించిన ఆకస్మిక తనిఖీల్లోనే తేలిపోయిందన్న మాట.
ఈ తనిఖీల నేపథ్యం ఇదీ
రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రజల్లో మాత్రం అసంతృప్తి పెరుగుతోందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జగన్ చేయించిన సర్వేల నివేదికలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. దీంతో జగన్ సచివాలయాలతో పాటు ప్రభుత్వ సేవలు అందే ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండే వారికి మెమోలు కూడా ఇస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం నాడు రాష్ట్రంలో పలుచోట్ల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మారువేషాల్లో వెళ్లి మరీ సచివాలయాలు, ఎరువుల షాపుల్లో అందుతున్న సేవలపై వివరాలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో జగన్ శిబిరం విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆయా అంశాలపై అవగాహనే లేకపోగా.. ఎక్కడికక్కడ ఎరువులు, పురుగుల మందులను ఇష్టారాజ్యంగా ఎక్కువ ధరలకు అమ్ముతున్న వైనం బయటపడింది. దీంతో తనిఖీలకు వెళ్లిన అధికారులు విస్తుపోయారు.
తనిఖీలు ఇలా జరిగాయి
చిత్తూరులోని 36వ డివిజన్ సచివాలయానికి డిప్యూటీ కలెక్టర్ పల్లవి ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించారు. అయితే నేరుగా తనిఖీలకు వెళ్తే సరైన సమాచారం రాదని తెలుసుకున్న ఆమె.. గృహనిర్మాణ లబ్దిదారుగా వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగారు. దీంతో వారు నీళ్లు నమిలారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కాసేపు ఆగి తాను డిప్యూటీ కలెక్టర్ అన్న విషయాన్ని బయటపెట్టారు. దీంతో అక్కడి సిబ్బంది అడ్డంగా బుక్కయ్యారు. సచివాలయంలో సేవలు అందించే విధానం ఇదేనా అంటూ డిప్యూటీ కలెక్టర్ పల్లవి సిబ్బందికి చీవాట్లు పెట్టారు. మరోవైపు విజయవాడలో సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ కూడా సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపుకు వెళ్లారు. ఎరువులు కావాలని దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్ కు స్టాక్ ఉన్నా లేదని యజమాని చెప్పాడు. దీంతో మరో షాపుకు వెళ్లి అక్కడ ఎరువులపై ఆయన ఆరా తీశారు. దీంతో సబ్ కలెక్టర్ కు ఎరువులు ఇచ్చి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేశారు. వసూలు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు.
ఆ తర్వాత ఒక్కో అధికారికీ ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించిన సబ్ కలెక్టర్.. రెండు షాపుల్నీ సీజ్ చేయించారు. మొత్తంగా సీఎం జగన్ ఎంతో ఉన్నతంగా కీర్తిస్తున్న సచివాలయాలు పెద్దగా రాణించడం లేదని, అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయని చెప్పక తప్పదు.