(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వారిద్దరూ రాజకీయ ఉద్దండులు. అధికార పార్టీలో ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే జిల్లాకు చెందిన వారు. మరో విశేషమేమిటంటే ఇద్దరూ మంచి క్రీడాకారులు. అంతే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అత్యంత ఆప్తులు. అటువంటి వ్యక్తుల మధ్య క్రికెట్ స్టేడియం నిర్మాణం పెద్ద చిచ్చు పెట్టింది. వారి సహచరులు, అభిమానుల కోరిక మేరకు తాము సూచించిన ప్రాంతంలోనే స్టేడియం నిర్మాణం జరగాలని ఇద్దరూ పట్టు పడుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చివరికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? ఎవరు పంతం వీడతారు? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వారెవరో, ఈ లొల్లి ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది కదా? తెలుసుకోండి మరి.
Also Read:-మంత్రి మండలి ఆమోదం.. సిక్కోలు క్రికెటర్లకు సువర్ణావకాశం
ఇద్దరూ ఇద్దరే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు. తమ్మినేని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్. ధర్మాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు వీరిద్దరి మధ్య శ్రీకాకుళం జిల్లాలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియం విషయంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. తాము సూచించిన ప్రాంతంలోనే దాని నిర్మాణం జరగాలని ఇరువురు చాప కింద నీరులా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.
దశాబ్దాలుగా ..
రాష్ట్రంలో శ్రీకాకుళంలో తప్ప అన్ని జిల్లాలకూ క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. శ్రీకాకుళంలో క్రికెట్ స్టేడియం కావాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నవ్యాంధ్ర సీఎం అయినా కూడా ఆ కోరిక అలాగే ఉండిపోయింది. వైసీపీ వచ్చాక మళ్ళీ ఈ జిల్లా ముఖ్య నాయకులు పావులు కదిపారు. జగన్ తాజా మంత్రి వర్గ సమావేశంలో సిక్కోలుకి క్రికెట్ స్టేడియం మంజూరు చేశారు. ఆముదాలవలస దగ్గర ఉన్న క్రీడా మైదానాన్ని ఏడాదికి రెండు లక్షల లీజు చెల్లించి క్రికెట్ స్టేడియంగా మార్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది రాష్ట్ర స్పీకర్ తమ్మినేని నియోజకవర్గం పరిధిలో ఉంది. అందువల్ల తమ్మినేని వర్గీయులు జిల్లాకు క్రికెట్ స్టేడియం తెచ్చామని సంబరపడుతున్నారట. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అసంత్రృప్తి వ్యక్తం చేస్తున్నారట. తానున్న మంత్రి వర్గ సమావేశంలో తనకు కూడా తెలియకుండా సైలెంట్ గా ఫైల్ మూవ్ చేసి ఆముదాలవలసకు క్రికెట్ స్టేడియాన్ని తమ్మినేని తెచ్చుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట . శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రికెట్ స్టేడియం ఉండాలి కానీ, మారుమూలన ఉన్న ఆముదాలవలసలో ఏంటని క్రికెట్ క్రీడాకారులు ధర్మాన కృష్ణదాస్ వద్ద మొర పెట్టుకున్నారట. దాంతో దాన్ని శ్రీకాకుళానికి మార్చడానికి ధర్మాన కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది.
Also Read:-ఎవరి పంతం నెగ్గుతుందో..?
రాజకీయ క్రీడలో ..
బాడీ బిల్డింగ్లో మిస్టర్ ఆంధ్రాగా తమ్మినేని, వాలీబాల్లో రాష్ట్రస్థాయి క్రీడాకారునిగా ధర్మాన సుపరిచితులు. వారిద్దరూ రాజకీయ క్రీడలోనూ ఆరితేరిన ఆటగాళ్లే. అయితే తమ్మినేని సీతారాం బాగా సీనియర్. పైగా జగన్ వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఇక ధర్మాన అంటే కూడా ముఖ్యమంత్రికి ఇష్టమే. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరూ క్రికెట్ స్టేడియం పంచాయితీ పెడితే జగన్ ఎటు మొగ్గుతారు అన్నది ఆసక్తికరమే. ఉప ముఖ్యమంత్రిగా తాను ఉండగా క్రికెట్ స్టేడియాన్ని శ్రీకాకుళానికి తీసుకురాకపోతే చిన్నతనంగా ధర్మాన భావిస్తున్నారట. ఆముదాలవలస పేరు ఇప్పటికే సూచించినందున దాన్ని విడిచి పెట్టుకుంటే తన పరపతి ఏమి కావాలని తమ్మినేని భావిస్తున్నారట. చివరికి ఈ పంచాయితీ ఎక్కడికి పోయి ఆగుతుందో, ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి.
Also Read: మంత్రి మండలి ఆమోదం.. సిక్కోలు క్రికెటర్లకు సువర్ణావకాశం