గణతంత్ర దినోత్సవం సందర్బంగా కేంద్రం 119 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయనతో పాటుగా మరో ఆరుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ పురస్కారాలు పొందినవారిలో తమిళనాడునుంచి ఎస్పీ బాలుకు పురస్కారం లభించగా మరో నలుగురు తెలుగువాళ్లకు ఈ పురస్కారాలు దక్కాయి. అందులో ముగ్గురు ఏపీకి చెందినవారు కాగా తెలంగాణకు చెందినవారు ఒకరున్నారు.
బాలుకి తమిళనాడు నుంచి..
గాన గంధర్వ ఎస్పీ బాలుకి అత్యున్నత పద్మవిభూషణ్ దక్కింది. ఎస్పీ బాలు కాకుండా తెలుగువారైన విజయవాడకు చెందిన వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామికి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్రావు, దేశంలో తొలి మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానుంచి గుస్సాడీ కళాకారుడు కనకరాజు ఎంపికయ్యారు.
Must Read ;- మరణానంతరం పద్మవిభూషణుల్లో బాలు
కర్ణాటక సంగీతంలో అన్నవరపు రామస్వామి..
విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి. ఆయన తండ్రి పెంటయ్య నాదస్వర విద్వాంసులు. 1996లో సంగీత నాటక అకాడమీ అవార్డుకూడా వరించింది. 1948నుంచి 1986వరకు ఆకాశవాణిలో సేవలందిచారు. కర్ణాటక సంగీతకారులైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, జి.ఎన్. బాలసుబ్రమణ్యం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్.మహాలింగం, సుందరం బాలచందర్కు వాయులీన సహకారం అందించారు. ఆయన పండిట్ వినాయకరావు పట్వర్ధన్, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ జస్రాజ్ వంటి వివిధ హిందుస్తానీ సంగీతకారులకు వయోలిన్ సహకారం అందించారు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సోమవరప్పాడులో 1926 మార్చి 27 జన్మించారు. రామస్వామి ప్రస్తుతం సూర్యారావుపేట వేమూరివారివీధిలో నివసిస్తున్నారు. గత 8 దశాబ్దాలుగా అనేక దేశాల్లో కచేరీలు చేశారు. ఆయన వందన, శ్రీదుర్గ అనే కొత్త రాగాలను, త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు. సంగీత నాటక అకాడమీ, మద్రాసు మ్యూజికల్ అకాడమీనుంచి టీటీకే మెమోరియల్ అవార్డు, ఏపీ ప్రభుత్వంనుంచి కళారత్న, విశ్వకళారత్న, మంగళంపల్లి అవార్డు అందుకున్నారు.
అవధానాల రికార్డు..
అవధాని డాక్టర్ ఆసాది ప్రకాశరావుకి కూడా పద్మ అవార్డు దక్కింది. అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరివిపల్లి లో 1944ఆగస్టు 2 న జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు ఆసాది పక్కీరప్ప, కుళ్లాయమ్మ. గురువు నండూరి రామకృష్ణమాచార్య ఈయన పేరును ఆశావాదిగా మార్చారు. సాంఘిక సంక్షేమ శాఖ స్కూల్, అనంతరం మున్సిపల్ హైస్కూల్, అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చదివారు. తొలుత ఏలూరులో గ్రూప్ 4కి సెలెక్ట్ అయ్యి డివిజనల్ క్లర్లుగా పనిచేశారు. తరువాత ఉద్యోగం వదిలి తెలుగు పండిట్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. పెనుకొండ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ గా 2002లో పదవీ విరమణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు చేశారు. అవధాన రంగంలో ఆయన కృషికి గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్డరేట్తో సన్మానించింది. ఏపీ ప్రభుత్వం కవికోకిల జాషువా పురస్కారాన్ని ప్రదానం చేసింది.
నిడుమోలు సుమతి..
ఏలూరుకు చెందిన దండమూడి సుమతీ రామ్మోమన్ రావు (నిడుమోలు సుమతి) మృదంగ వాద్యాన్ని వృత్తిగా మార్చుకున్న తొలి కళాకారిణిగా రికార్డు సాధించారు. 1950లో ఏలూరులో పుట్టిన, ప్రస్తుతం విజయవాడలో స్థిరపడిన నిడుమోలు సుమతి తండ్రి నిడుమోలు రాఘవయ్య వద్ద శిష్యరికం చేశారు. చిన్నతనం నుంచే పట్టు సాధించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి అనేక మంది ప్రముఖులకు ఆమె వాద్య సహకారం అందించారు. తొలి గురువు దండమూడి రామమోహనరావును పెళ్లాడారు. మృదంగ శిరోమణి”, “మృదంగ మహారాణి”, “నాదభగీరథ”, “మృదంగ లయ విద్యాసాగర” బిరుదులున్నాయి. 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. తెలుగు విశ్వవిద్యాలయంనుంచి ప్రతిభా పురస్కారం దక్కింది.
గుస్సాడీ కనకరాజు..
గుస్సాడీ రాజుగా ఆదివాసీల మదిలో నిలిచిన కనకరాజుకు.. గుస్సాడీ నృత్యంలో చేస్తున్న సేవకు గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. తెలంగాణనుంచి ఈ ఏడాది కనకరాజు ఒక్కటికే పురస్కారం దక్కింది. అసిఫాబాద్ కుమురం భీం జిల్లా (గతంలో ఉమ్మడి ఆదిలాబాద్) వాసి అయిన కనకరాజు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే గుస్సాడీ నృత్యాన్ని దిల్లీలోనూ ప్రదర్శించారు. కనకరాజు జైనూరు మండలం మార్లవాయి లో ఐటీడీఏ పాఠశాలలో కుక్ గా ఉంటూనే విద్యాభివృద్ధికి తోడ్పాడ్డారు. 80 ఏళ్ల వయసులోనూ ఆ కళలో యువకులకు శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశంలో గణతంత్ర వేడుకల్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తొలిసారిగా ధిల్లీలో గుస్సాడీ ప్రదర్శన చేసి ఆకట్టుకోగా అబ్దుల్ కలాం హయాం లోనూ ఆ ప్రదర్శనలు జరిగాయి. ఈయన బ్రిటీష్ అధికారి సాయంతో విద్యాభివృద్ధికి తోడ్పాటునందించారు. దేశవ్యాప్తంగా గిరిజన సహకార సంస్థ ఏర్పాటుకు ఈయన తోడ్పాటు ఉందని కూడా చెబుతారు. ఈయన అవార్డుకోసం దరఖాస్తు కూడా చేయలేదని, వార్తల్లో విని తెలుసుకున్నానని మీడియాకు చెప్పడం గమనార్హం.
Also Read ;- ఆ పాట అధరామృతం.. ఆ గానం గంధర్వ గానం











