(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆయన చేసేది చిన్న ఉద్యోగం. కానీ ఆస్తులు మాత్రం భారీగానే కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం పంచాయతీ కార్యదర్శి, ఇన్ఛార్జి విస్తరణాధికారి ఆగూరు వెంకటరావుపై ఏసీబీ దాడులు జిల్లా వ్యాప్తంగా ఆ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపాయి. పైడి భీమవరంలో అతను విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యాలయం, వంగర మండలం అరసాడలోని బంధువుల ఇళ్లలో ఏక కాలంలో తనిఖీలు జరిపారు. విశాఖలోని ఆయన స్వగృహంలో ఉదయం ఆరు గంటలకే సోదాలు ప్రారంభమయ్యాయి. అక్కడ భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పైడి భీమవరం పంచాయతీ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించారు. కంప్యూటర్లలో డేటాను సేకరించారు. అరసాడలో వెంకటరావు బంధువుల ఇళ్లల్లోనూ జరిపిన సోదాల్లో కొన్ని కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అక్రమార్జన రూ. 5 కోట్లకుపైనే ఉండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
వీడీవోగా విధుల్లో చేరి..
రెండున్నర దశాబ్దాల కిందట గ్రామ అభివృద్ధి అధికారి (వీడీవో)గా శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోనే వెంకటరావు ఉద్యోగంలో చేరారు. తర్వాత వీడీవో నియామకాల్లో ఆంగ్ల, తెలుగు మాధ్యమం అభ్యర్థుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా అప్పట్లో నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆ వ్యవస్థ రద్దయిన తర్వాత పంచాయతీ కార్యదర్శిగా అక్కడే కొంతకాలం పనిచేశారు. 2011లో సొంత జిల్లాకు బదిలీపై వచ్చి బంటుపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ఆరేళ్ల కిందట పైడి భీమవరం వచ్చి అప్పటి నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. రణస్థలం పంచాయతీ విస్తరణాధికారి ఆరునెలల కిందట బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కూడా ఈయనే చూస్తున్నారు. చేసేది చిన్న ఉద్యోగమైనా ఆస్తులు ఎక్కువగా ఉండటంతో అదంతా ఎలా వచ్చిందని ఏసీబీ అధికారులు నివ్వెర పోతున్నారు. దానిపైనా అధికారులు కూపీ లాగుతున్నారు. పైడి భీమవరం జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. జిల్లాలో విలువైన భూములు ఉన్న ప్రాంతాల్లో పైడి భీమవరం కూడా ఒకటి. అక్కడ అన్నీ రసాయన పరిశ్రమలే. అయితే అనుమతుల మంజూరులో ఏవైనా అవకతవకలు జరిగాయా, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరయ్యాయా అనే కోణంలోనూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు.
Also Read:దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు.. వెల్లంపల్లికి మూడినట్టేనా?











