ఏపీలో వైసీపీ పాలన ప్రారంభమయ్యాక… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్న దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు మరే మంత్రి మీద రాలేదనే చెప్పాలి. తాజాగా గురువారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఏసీబీ సోదాలు ప్రారంభమైపోయాయి. నాలుగు బృందాలుగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దుర్గ గుడిలోని పలు విభాగాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో వెల్లంపల్లికి మూడినట్టేనని, ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించడం ఖాయమేనన్న వాదనలు మరింతగా వినిపిస్తున్నాయి.
2009 ఎన్నికల్లో గెలిచినా..
విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వెల్లంపల్లి... మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ వైపు వీచిన గాలిలో గెలిచేశారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున బరిలోకి దిగిన వెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచినా పెద్దగా ఎలివేషన్ రాలేదు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయిన వెల్లంపల్లి… 2014 ఎన్నికల్లో మరోమారు పశ్చిమ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగి వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇలా అయితే కాదని ఓ నిర్ధారణకు వచ్చిన ఆయన ఆ తర్వాత నేరుగా వైసీపీలోకి చేరిపోయారు. వెల్లంపల్లి దూకుడు, ఓ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న జగన్… విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఓటమిని చవి చూశారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన వెల్లంపల్లి… వైసీపీ వైపు వీచిన గాలిలో గెలిచేశారు. తన సామాజిక వర్గం నుంచి పెద్దగా నేతలు లేని నేపథ్యంలో ఏకంగా జగన్ కేబినెట్ మంత్రిగా… అది కూడా దేవదాయ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
మంత్రి పదవి రాగానే..
ఇక్కడి దాకా బాగానే ఉన్నా… మంత్రి పదవి దక్కిన తర్వాత వెల్లంపల్లి తనదైన శైలిలో చక్రం తిప్పడం మొదలెట్టేశారన్న వాదనలు వినిపించాయి. దుర్గ దుడిపై పెత్తనం కోసం ఓ రేంజిలో చక్రం తిప్పిన వెల్లంపల్లి… ఏకంగా దుర్గ గుడి ఈవోగా తనకు నచ్చిన, తాను చెప్పినట్లు వినే అధికారిని వేయించుకోగలిగారు. తాను కోరిన అధికారి దుర్గ గుడికి ఈవోగా వచ్చేదాకా ఓ మోస్తరు స్పీడులో వెళ్లిన వెల్లంపల్లి… ఆ తర్వాత స్పీడు పెంచారన్న వాదనలు లేకపోలేదు. ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక దుర్గ గుడిలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దుర్గ గుడిలోని వెండి విగ్రహాలు మాయమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేగగా.. దానిని ఓ తేలికపాటి కేసులా వెల్లంపల్లి తీసేసిన వైనం నిజంగానే ఆశ్చర్యం కలిగించిందని చెప్పాలి. అసలు ఈ వ్యవహారంపై పకడ్బందీ దర్యాప్తు జరిగిన దాఖలా కూడా కనిపించలేదు. ఇక ఆలయంలో దర్శనాలు, దర్గమ్మకు భక్తులు సమర్పిస్తున్న కానుకలు, ఆలయంలో ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బంది నియామకం తదితరాలన్నింటినీ వెల్లంపల్లి తన చెప్పు చేతల్లోకి తీసుకున్నారన్న విమర్శలు లేకపోలేదు.
Must Read ;- అమ్మవారి నిధులు పక్కదారి.. దుర్గగుడిలో ఏసీబీ సోదాలు
ఇంటా బయటా వ్యతిరేకత..
ఇక వెల్లంపల్లి నేతృత్వం వహిస్తున్న దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలపై వరుసపెట్టి దాడులు జరిగిన తీరు కూడా రాష్ట్రంలో పెను కలకలమే రేపింది. ఈ వార్తలపై స్పందించే సమయంలో అదుపు తప్పి వ్యవహరించిన తీరుతో వెల్లంపల్లి అభాసుపాలయ్యారనే చెప్పాలి. ఆయా ఘటనలపై దర్యాప్తు చేయిస్తున్నామని ఒక సారి, దర్యాప్తులో ఏం తేలుతుందని మరోమారు పరస్పర విరుద్ద ప్రకటనలు చేసిన ఆయన తనను మాత్రమే కాకుండా మొత్తంగా వైసీపీ సర్కారునే ప్రమాదంలో పడేశారన్న వాదనలు లేకపోలేదు. దీంతో వెల్లంపల్లిపై క్రమంగా ఇంటా బయటా వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఇలాంటి కీలక సమయంలో దుర్గ గుడిపై ఏసీబీ దాడులనే వార్త బాంబులా పేలింది. గురువారం ఉదయం రంగంలోకి దిగిన నాలుగు బృందాల ఏసీబీ అధికారులు.. ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు, చీరల విక్రయ కేంద్రాలు, స్టోర్ రూంలు, ప్రసాదం కౌంటర్లు, ప్రసాదం తయారీకి వినియోగించే వస్తువులను భద్రపరిచే ప్రొవిజన్ స్టోర్స్.. ఇలా మొత్తంగా ఆలయంలోని దాదాపుగా అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని ఈవో కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లోని కంప్యూటర్లు, బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఆయనను టార్గెట్ చేసుకునే సోదాలు?
మొత్తంగా దుర్గ గుడిపై ఏసీబీ సోదాలను చూస్తుంటే… వెల్లంపల్లిని టార్గెట్ చేసుకునే ఈ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రతి విషయంలోనూ కాలుపెడుతున్న వెల్లంపల్లి తనను తాను ఇరికించుకోవడంతో పాటుగా మొత్తంగా ప్రభుత్వాన్నే అభాసుపాలు చేస్తున్నారన్న భావనతోనే.. ప్రభుత్వంలోని పెద్దలు ఏసీబీ దాడులకు అనుమతి ఇచ్చి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఏసీబీ దాడుల్లో వెలుగు చూసే విషయాల ఆధారంగా వెల్లంపల్లిపై చర్యలు తప్పవన్న వాదనలూ లేకపోలేదు. ఈ మాట నిజమేనంటూ… దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు మొదలవ్వగానే… వెల్లంపల్లిపై విపక్ష నేతలు వరుస విమర్శలు గుప్పించడంతో పాటుగా ఆయన అక్రమాల లిస్టులను బయటపెట్టేస్తున్నారు. సో… వెల్లంపల్లికి మూడినట్టేనన్న మాట.
Also Read ;- మంత్రి వెల్లంపల్లి ఓ బఫూన్.. జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు