తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది. ఆర్థిక వనరులున్న హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడం, రాజధాని కూడా లేకుండా ప్రస్థానం మొదలెట్టడం, అప్పటికే ఆర్థిక లోటు నెత్తినపడటం.. తదితర కారణాలతో అప్పులతోనే ఏపీ ప్రస్థానం మొదలైందని చెప్పాలి. ఈ క్రమంలో 13 జిల్లాలతో కొత్త ప్రయాణం చేపట్టిన ఏపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి.. ఆర్థికంగా రాష్ట్రాన్ని గడ్డన పడేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి.. భూసేకరణకు సింగిల్ పైసా ఖర్చు లేకుండానే ప్లాన్ చేశారు. అయితే ఆదాయం అంతగా లేని కారణంగా చంద్రబాబు కూడా కొద్దికాలం పాటు అప్పులనే ఆశ్రయించక తప్పలేదు. అయితే రుణాలు తీసుకునే సంస్కృతిని కొద్దికొద్దిగా తగ్గిస్తూ.. రాష్ట్ర ఆదాయాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ సాగారు. అదే రీతిన ఇంకో ఐదేళ్లు సాగి ఉంటే.. అప్పుల్లో నుంచి ఏపీ బయటపడేదేనన్న వాదనలూ వినిపించాయి.
ప్రతి దానికీ అప్పులే దిక్కు
అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు స్థానంలో జగన్ సీఎం అయ్యారు. అదే అదను.. రాష్ట్ర ఆదాయం పెరిగే దిశగా తీసుకున్న చర్యలను విచారణల పేరిట జగన్ మందగించేలా చేశారన్న భావన వ్యక్తవుతోంది. అంతేకాకుండా ఆదాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు ప్రకటించిన జగన్.. వాటి అమలు కోసం నెలనెలా అప్పులనే ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. వెరసి ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వెరసి ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉద్యోగుల వేతనాలకు అప్పుల కోసం వెళితే.. ఇక సంక్షేమ పథకాలకు నిధులెలా వస్తాయి? అప్పులు చేయాల్సిందే. లేదంటే ఆ సంక్షేమ పథకాలను నిలిపేయాల్సిందే. వ్యక్తిగతంగా ఇమేజీ పెంచుకునే బాటలో సాగుతున్న జగన్ సంక్షేమ పథకాలను ఆపే దిశగా సాగడం లేదు. ఎప్పటికప్పుడు అప్పులనే ఆశ్రయిస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలుమార్లు లేఖలు కూడా రాసింది. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అప్పులు చేస్తున్న వైనంపై నిలదీసింది కూడా.
సస్పెన్షన్ కు కారణాలివే
ఇలాంటి నేపథ్యంలో పలు మీడియా సంస్థలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస కథనాలను రాస్తున్నాయి. ఈ కథనాలపై జగన్ సర్కారు తనదైన శైలి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ తరహా కథనాలను రాసే మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులను అష్టదిగ్బంధనం చేస్తోంది. అయినా కూడా ఈ కథనాలు ఆగడం లేదు. ఈ కథనాలను నిలువరించడం ఎలాగన్న కోణంలో ఆలోచించిన జగన్ సర్కారు.. అసలు సదరు కథనాలకు సంబంధించిన సమాచారం ఆయా మీడియా సంస్థలకు ఎలా వెళుతోందని ఆరా తీసింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న నాగులపాటి వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసుర్లు వరప్రసాద్, శ్రీనుబాబుల ద్వారా ఈ సమాచారం వారికి చేరుతోందని తేలిందట. అంతే.. ముందూ వెనుకా చూడకుండా ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ జగన్ సర్కారు బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి సంస్థకు చెందిన పలు కీలక డాక్యుమెంట్లను ఈ ముగ్గురు అధికారులు మీడియాకు లీక్ చేశారని, అందుకే వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయినా ఆర్థిక పరిస్థితి బాగు పడాలంటే.. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణకు పూనుకోవాల్సిన ప్రభుత్వం.. ఏదో రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న చందంగా ఉద్యోగులపై వేటు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- దేవినేనికి బెయిల్!.. జగన్ కు మరో షాకే కదా!