సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర పై ఏపీలో మరోసారి చర్చ మొదలైంది. ఆయన ఏపీలో సేవలందించేందుకు వస్తారని తాను అనుకోవడం లేదని టీడీపీ నేత వర్లరామయ్య చేసిన ట్వీట్, ఆ మేరకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. ఏపీ సీఎం అయ్యాక జగన్ తెలంగాణ కేడర్లో ఇద్దరు అధికారులను ఏపీకి రప్పిచుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, వైఎస్కు చీఫ్ సెక్యూరిటీగా అధికారిగా పని చేసిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవాలని వైఎస్ జగన్ భావించారు. వీరు ఏపీకి వస్తే కీలక బాధ్యతలు అప్పజెప్పాలని కూడా భావించారట. ఈ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించిన జగన్..కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. అయితే కేంద్ర హోంశాఖ మాత్రం స్పందించలేదు. దీంతో ఆ ఇద్దరు అధికారులు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సమయంలోనే శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే స్టీఫెన్ రవీంద్ర విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
గత ఫిబ్రవరిలో మళ్లీ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద కూడా ఆ ఇష్యూని లేవదీసినట్టు ప్రచారం జరుగుతోంది. తరువాతి కాలంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా పలుమార్లు ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయంలో ప్రయత్నాలూ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇదే ఉద్దేశమా..
సంక్రాంతి తరువాత జగన్ ఏపీలో రచ్చబండ కార్యక్రమం చేపట్టనున్నారు. దీంతోపాటు తిరుపతిలోనూ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలోనూ భిన్నాభిప్రాయలున్నాయి. కొన్ని వర్గాలనే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణా ఉంది. మరోవైపు ఏపీలో రాజకీయ సమీకరణాలు మారతాయన్న అంచనా ఉన్న నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్రను ఇంటిలిజెన్స్ చీఫ్గా నియమించాలని జగన్ సర్కారు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో స్టీఫెన్ రవీంద్ర వైఎస్కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరుగా పనిచేయడంతో పాటు రాయలసీమలోనూ సేవలందించారు. ఆ ప్రాంతంపై స్టీఫెన్ రవీంద్రకు పట్టుంది. పనుల పెండింగ్ విషయంలో స్టీఫెన్ రవీంద్ర చాలా సీరియస్గా ఉంటారని కూడా ఆ ప్రాంత పోలీసులు అప్పట్లోనే భయపడేవారు. ఈ కారణాల నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకురావాలని జగన్ భావించారని తెలుస్తోంది.
Musr Read ;- తాడేపల్లి కోటలోకి.. పాత కేసుల్లోని ‘జగన్ దళం’!

వర్ల రామయ్య ట్వీట్ ..
ఇదే అంశంపై టీడీపీ నేత వర్లరామయ్య చేసిన ట్వీట్ కూడా చర్చకు కారణమైంది. మాజీ పోలీసు అధికారి అయిన వర్ల రామయ్య ట్వీట్ చేయడం వెనుక కారణం ఉండి ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టిందన సమాచారం ఉండి ఉండవచ్చని, అందుకే ఆయన ట్వీట్ చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇక వర్ల రామయ్య ట్వీట్లో ‘స్టీఫెన్ రవీంద్ర ఓ మంచి పోలీస్ అధికారి. పోలీస్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి. అటువంటి అధికారి, ఇంతటి ప్రశ్నార్థకమైన పరిపాలన, పలు అవినీతి కేసుల్లో ముద్దాయి అయిన ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రానికి “ఇంటెలిజెన్స్ చీఫ్” గా వస్తారని ఆయన తెలిసిన వానిగా నేననుకోను.’అని ట్వీట్ చేశారు.
ఇక ఇక్కడే మరో చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీలు, నియామకాలు ప్రభుత్వాల ఇష్టాయిష్టాలను బట్టి జరుగుతుంటాయి. చాలా వరకు ప్రభుత్వాలు సక్సెస్ అవుతాయి. ఈ అంశం ప్రజల్లోనూ, ఇతర పార్టీల్లోనూ, సదరు విభాగాల్లోనూ ఎక్కవ కాలం చర్చగా మారకూడదు. ఎక్కువకాలం చర్చ నడిస్తే..సదరు అధికారులపై పరోక్షంగా తీవ్ర వత్తిడి ఉంటుంది.. అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Also Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!











