తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 9నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన రికార్డు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సొంతం. ఆయనను ఆదర్శంగా తీసుకున్న చాలా మంది రాజకీయాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అంతేకాదు.. టీడీపీ చరిత్రలో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఎంత ప్రాధాన్యం ఉందో.. డిసెంబరు 16కి అంతే ప్రాధాన్యం ఉంది. ఆ తేదీని టీడీపీ కార్యకర్తలు మర్చిపోలేని రోజు…
టీడీపీ చరిత్రను మలుపు తిప్పిన రోజు..
డిసెంబరు 16..టీడీపీ చరిత్రను మలుపు తిప్పిన రోజు.. పార్టీ ఆవిర్భావం తరువాత..8నెలలకు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార సభలు మొదలయ్యాయి. అప్పటికే చైతన్యరథంపై సభలు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ తన ప్రచారంలో వాడిని పెంచారు. ’తెలుగుదేశం పిలుస్తోంది..రా..కదలిరా’ అనే నినాదంతో పాటే..ఆత్మగౌరవ నినాదం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ ఎన్నికల ప్రచారం 19రోజుల పాటే జరిగింది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 202 సీట్లతో టీడీపీకి పట్టం గట్టారు. ఈ ఎన్నికల్లో 90 శాతానికి పైగా అభ్యర్థులు రాజకీయాలకు కొత్తవారే. ఈ రికార్డు ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో చెరపలేని అంశంగా చెబుతారు.
మర్చిపోలేని తొలి ప్రసంగం
1982 మార్చిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది. పార్టీ ఏర్పాటైన వెంటనే ఎన్టీఆర్ ప్రజల్లోకి వచ్చేశారు. పదునైన భావోద్వేగ ప్రసంగాలతో పాటు అలనాటి రాజకీయాలపై విమర్శలను గురిపెట్టి ఢిల్లీ రాజకీయాలను సైతం గడగడలాడించారు. 1982 మార్చి 29న ఇప్పటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎన్టీఆర్ తొలి ప్రసంగం ఇప్పటికీ ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు గుర్తుంటుంది. అప్పటి నాయకులు ఇప్పటికీ వేర్వేరు పార్టీలో ఉన్నా.. ఆ ప్రసంగం మాత్రం మర్చిపోరు. ‘శ్రామికుడి చమట చుక్కల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటి చుక్కల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. కష్ట జీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్ధుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగు దేశం అని చేసిన ప్రసంగం చరిత్రను సృష్టించింది. తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకుంది.
దేశంలోనే రెండో స్థానం..
అంతేకాదు.. 1984లో జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లు సాధించింది. దేశంలో ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఇన్ని స్థానాలు గెలుచుకుని దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష పార్టీ స్థాయి పాత్రను పోషించింది. అప్పట్లో కాంగ్రెస్కు 426 స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి దేశ వ్యాప్తంగా రెండు సీట్లు వచ్చాయి.అందులో ఒకటి హనుమకొండ ఎంపీ సీటు కూడా ఉంది. అక్కడ చందుపట్ల జంగారెడ్డి గెలిచారు. దక్షిణాదిలో బీజేపీ గెలిచిన తొలిసీటు ఇదే. ఇక టీడీపీ నుంచి గెలిచిన వారిలో 75శాతం పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులే ఉన్నారు. ఆ స్థాయిలో సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీగా టీడీపీ నిలిచింది. కాగా చైతన్యరథానికి దివంగత టీడీపీ నేత, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ సారథిగా వ్యవహరించారు. చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. అప్పట్లో టీడీపీ ఓ సంచలనం.. ఓ రికార్డు.. బడుగు, బలహీన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన తొలి రాజకీయ పార్టీ.. అందుకే డిసెంబరు 16న మొదలైన ఎన్నికల ప్రచారం టీడీపీ చరిత్రను మలుపు తిప్పిందని చెప్పవచ్చు.
Must Read ;- తిరుపతిలో గ్రౌండ్ వర్క్ మొదలెట్టిన తెలుగుదేశం
https://www.youtube.com/watch?v=l5qeNGey02k











