‘ఆర్.ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కార్తికేయ. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు అంతగా మ్యాజిక్ చేయలేకపోయాయి. అందుకే ఇప్పుడు ‘చావుకబురు చల్లగా’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ రోజే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తో కార్తికేయ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? అసలు ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం..
కథేంటి?
బస్తీబాలరాజు (కార్తికేయ) నగరంలో చనిపోయిన వారి భౌతిక దేహాల్ని అంతిమ యాత్ర వాహనంలో స్మశానికి తరలిస్తూ.. వారి అంత్యక్రియల్ని నిర్వహిస్తూ ఉంటాడు. మంచాన పడ్డ తండ్రి, తల్లితో అతడు ఒక స్లమ్ ఏరియాలో నివసిస్తూంటాడు. శవాల్ని తీసుకెళ్ళే క్రమం లో ఒక ఇంటికి వెళ్ళిన అతడు.. అక్కడ మల్లిక (లావణ్య త్రిపాఠి) అనే అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి చనిపోయిన పీటర్ అనే వ్యక్తి భార్య. తొలిచూపులోనే ఆ అమ్మాయి నచ్చేసి.. ఆమె భర్త అంత్యక్రియల నాడే.. తనని పెళ్ళి చేసుకోమని అడుగుతాడు. షాకయిన ఆ అమ్మాయి అత్త (రజిత), మామ (మురళీ శర్మ) లు అతడ్ని అక్కడ నుంచి కొట్టి పంపిస్తారు. అయినా సరే బాలరాజు మల్లిక వెంట పడుతునే ఉంటాడు. చివరికి కార్తికేయ ఆమె ప్రేమను ఎలా పొందుతాడు? వాళ్ళిద్దరూ ఒకటవుతారా? అనేది మిగతా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
తొలి చూపులోనే ఒక అమ్మాయిని జులాయి లాంటి ఓ అబ్బాయి ప్రేమించేసి.. ఆమె వెంట పడడం.. ఆమె కొట్టినా, చీ కొట్టినా.. ఆమెనే తన లోకంగా బకడం .. చివరికి ఆ అమ్మాయి మనసు అతడు గెలుచుకోవడం .. లాంటి రొటీన్ కథలతో గతంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే ఆ స్టోరీ లైన్ నే కాస్త కొత్తగా చెప్పాలనుకున్నాడు కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి.
పొద్దన్న లేస్తే పుట్టుకల్ని మాత్రమే చూసే (మెటర్నిటీ వార్డ్ లో పనిచేసే ఒక నర్స్ ) ఒక విధవరాల్ని.. రోజూ చావుల్ని చూడ్డమే తన పనిగా పెట్టుకున్న ఒక అబ్బాయి ఇష్టపడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో.. దాన్ని ఎమోషనల్ గా చెప్పాలనుకున్నాడు. అయితే అందులో పూర్తిగా కాకపోయినా.. కొంతలో కొంత సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
రోజూ చావుల్ని దగ్గరుండి చూడడం వల్ల… దాని విలువ తెలీని అబ్బాయిని.. తననెంతో ఇష్టంగా చూసుకున్న భర్త చనిపోతే .. ఆ భాధ నుంచి ఇంకా కోలుకోని ఓ అమ్మాయి తన మనసులో వేరొకరికి ఎలా స్థానమిస్తుంది అనే పాయింట్ తో కథను లాక్ చేయాలనుకున్నాడు దర్శకుడు. ఆ ఆలోచన కూడా బాగానే ఉంది. కాకపోతే.. అక్కడ నుంచి కథను నడిపించడంలో కాస్తంత కన్ఫ్యూజ్ అయ్యాడు దర్శకుడు. ఆ విషయం హీరోకి అర్ధం అవడానికి .. అతడి తల్లి (ఆమని ) పాత్రతో మరో ఉప కథను నడిపించాడు. ఆ పాయింట్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం లోనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
ఫస్టాఫ్ అంతా పుల్ కామెడీగా.. సినిమాను బోర్ కొట్టించకుండా.. నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ దగ్గర కొంచెం తడబడ్డాడు. సెకండాఫ్ పూర్తిగా సీరియస్ మోడ్ లోకి వెళ్ళడంతో .. ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయింది. అలాగే.. కొన్ని సీన్స్ బోర్ అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ లోని ఎమోషన్స్ , డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే.. అనసూయ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుంది. ఇంకా .. సంగీతం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. నిర్మాణ విలువలు , సినిమాటో గ్రఫీ బాగున్నాయి.
బస్తీ బాలరాజు గా కార్తికేయ చాలా పరిణతి కలిగిన నటనను ప్రదర్శించాడు. డైలాగ్ డెలివరీ, ఈజె నెస్ మెప్పిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే.. అతడి కేరక్టరైజేషన్ పూరీ సినిమాల్లోని హీరో కేరక్టరైజేషన్ ను పోలి ఉంటుంది. అలాగే.. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో అతడి బాడీ లాంగ్వేజ్ బాగా కుదిరింది. ఇక మల్లిక గా లావణ్య త్రిపాఠి పాత్రకు తగ్గ రీతిలో బాగానే చేసింది. లావణ్య మామగారి గా మురళీ శర్మ .. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆమని తమ తమ పరిధి మేరకు చక్కగా నటించారు. ఇంకా భద్రం, జబర్దస్త్ మహేశ్ కామెడీ మెప్పిస్తుంది. మొత్తానికి చావుకబురు చల్లగా సినిమా యావరేజ్ అనిపిస్తుంది. సినిమా ఒకసారి చూడొచ్చు.
నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, రజిత, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, జబర్దస్త్ మహేశ్, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం : జేక్స్ బెజాయ్
సినిమాటో గ్రఫీ : కర్మ్ చావ్లా, సునీల్ రెడ్డి
నిర్మాణం : గీతా ఆర్ట్స్ 2
నిర్మాత : బన్నీ వాసు
రచన, దర్శకత్వం : కౌశిక్ పెగళ్ళపాటి
హైలైట్స్ : కార్తికేయ నటన, కామెడీ, డైలాగ్స్
ఒక్కమాటలో : చావు కబురు.. యావరేజ్ గా
విడుదల తేదీ : మార్చ్ 19, 2021
రేటింగ్ : 2.5 /5
-ఆర్కే











