తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరిగింది. దీనికి కారణమేంటని అందరూ ఇప్పుడు లెక్కలేస్తున్నారు. వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకోలేదు. ఆ సమయంలో నాగేశ్వర్ లాంటి వామపక్ష మేధావులకే పట్టభద్రులు పట్టం కట్టారు. తర్వాత తర్వాత వాటిపైనా రాజకీయ పార్టీల కేంద్రీకరణ పెరిగింది.
ప్రతి పదవి కీలకం
ప్రతి పదవి కీలకం అయిపోయింది. అది ఏ పదవి అయినా సరే.. అధికార పార్టీకో తర్వాత బలంగా ఉండే ప్రతిపక్ష పార్టీకో దక్కాల్సిందే. అప్పట్లో కాంగ్రెస్ పట్టించుకోలేదు.. టీఆర్ఎస్ అసలు పోటీ చేయలేదు. కేవలం బీజేపీ మాత్రమే ప్రయత్నించింది. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా అంత కేంద్రీకరించలేదు. కేవలం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలపైనే అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ ఫోకస్ చేశాయి. కాని పరిస్ధితులు మారాయి.. మేధావి అయినా సరే మనోడు అయి ఉండాలనే ట్రెండ్ వచ్చేసింది. ఎందుకంటే గతంలో గెలిచిన మేధావులు ప్రభుత్వాలను శాసనమండలిలో నిలదీశారు. నాగేశ్వర్ లాంటివాళ్లు అయితే.. అంకెలతో సహా చెప్పి.. చిన్నపిల్లవాడికి కూడా అర్ధమయ్యేలా వాదించడంతో.. ప్రభుత్వానికి మింగుడుపడలేదు.
ఇలాంటి సందర్భాలలోనే రాజకీయ పార్టీలు ఆ ఎమ్మెల్సీ పదవుల్లో కూడా రాజకీయనేతలే ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే ఈసారి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో సహా ఇతర మేధావులు ఈ ఎమ్మెల్సీకి పోటీ పడటం, పైగా రాజకీయ పార్టీలన్ని ఫోకస్ చేయడం.. దీనికి తోడు డబ్బులు పంచే కల్చర్ కూడా పెరగడంతో… ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానంలో బలమైన అభ్యర్ధులు నిలబడి పోరు చేయడంతో కూడా ఓటింగ్ శాతం బాగా పెరిగింది.
బలమైన అభ్యర్థుల పోటీ
ఒకవైపు బీజేపీ రామచంద్రరావు బలంగా పోటీ చేయడం.. మరోవైపు టీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని నిలబెట్టడంతో పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సైతం చిన్నారెడ్డి లాంటి నాయకుడిని పోటీకి దింపడంతో.. మరింత తీవ్రంగా పోటీ పెరిగింది. వీరందరూ ఒక ఎత్తయితే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఇండిపెండెంట్ కూడా కీలకమైన అభ్యర్ధిగా మారడంతోనే.. ఓటింగ్ శాతం పెరిగింది. ఈ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓటు కీలక పాత్ర పోషించనున్నదని తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలో చిన్నారెడ్డి గణనీయమైన ఓట్లు పొందారని.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్, బీజేపీ పంచుకున్నాయని.. కాని వీరందరికి వేసినవారు రెండో ప్రాధాన్యత ఓటు నాగేశ్వర్కి వేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకంగా మారితే నాగేశ్వర్కే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలిపోయేటట్లయితే టీఆర్ఎస్, బీజేపీలకే ఛాన్స్. అందులోనూ బీజేపీ రామచంద్రరావుకే ఎక్కువ అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
బలమైన అభ్యర్ధులు లేకపోవడం..
ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో అయితే పల్లా రాజేశ్వరరెడ్డికి పోటీకి బలమైన అభ్యర్ధులు ఎవరూ నిలబడకపోవడం టీఆర్ఎస్కి కలిసొచ్చే అంశం. పల్లాపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్గాని.. బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డి గాని బలమైన పోటీ ఇవ్వలేకపోయారని అంటున్నారు. రుద్రమదేవి లాంటి జర్నలిస్టులు కూడా పోటీలో ఉన్నా.. వారి ప్రభావం తక్కువగానే ఉందంటున్నారు. ఇక కీలకంగా చెప్పాల్సింది కోదండరామ్ గురించే. తెలంగాణ ఉద్యమంలో ఉన్నా సరే.. మంచి పేరు ఉన్నా సరే… పోటీలో మాత్రం ప్రభావం చూపించలేని పరిస్ధితిలోనే ఆయన ఉండటం దురదృష్టకరమనే చెప్పాలి. ఫలితాలొచ్చాక.. ఇక పెద్దల సభ కూడా పెద్దరికం లేని సభేనని తేలుతుందనడంలో సందేహం లేదు.
Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసమే ఉక్కుకు కేటీఆర్ మద్దతు డ్రామా : రేవంత్











