Central Government Invited Bids For Visaka Steel Plant :
ఆంద్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వివిధ కార్మిక సంఘాలు, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం తన నిర్ణయానికే కట్టుబడి ముందుకు అడుగులు వేస్తోంది. కార్మిక సంఘాల ఆందోళనలు, రాజకీయ పక్షాల వినతులు, జీవీఎంసీ తీర్మానాలను పక్కన బెట్టి ప్రైవేటీకరణకు వేగంగా కదులుతోంది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.
టెండర్లను ఆహ్వానిస్తూ ఉత్తర్వులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు దాదాపు రంగం సిద్ధమైంది. ప్రైవేటీకరణకు సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ మ్యాప్ సిద్ధం చేసి అమ్మకానికి షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా లీగల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ లను కేంద్రం నియమించింది కేంద్రం. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అంగీకరించేది లేదంటూ స్థానికంగా జరుగుతున్న ఉద్యమాలు, అభ్యంతరాలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
జూలై 7 నుండి టెండర్లు ఆహ్వానిస్తూ బిడ్డింగ్ ప్రారంభించారు. బిడ్లకు సంబంధించిన అప్లికేషన్లను బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.15వ తేదీన ప్రీ-బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు. బిడ్ సమర్పణకు చివరి తేదీ 28గా నిర్ణయించారు. 29వ తేదీన సాంకేతిక బిడ్లను ప్రకటించనున్నారు. బిడ్లలో పాల్గొనడానికి రూ .1 లక్ష డిపాజిట్ , రూ.1 కోటి ఆర్థిక సంస్థ హామీ ఇవ్వాలని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో ఎంపికైన కంపెనీకి తక్షణమే స్టీల్ ప్లాంట్ ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.
అనుబంధ సంస్థలు కూడ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు దానికి అనుబంధంగా ఉన్న 100 శాతం అనుబంధ సంస్థలను సైతం విక్రయిస్తామని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ గనులు అదనంగా విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్పై కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు మార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలంటూ కార్మిక సంఘాలు అఖిలపక్ష పార్టీ నేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రానికి లేఖలు రాసినా ఏమి ఖాతరు చేయలేదు.
ఈ ఏడాది చివరికల్లా ప్రైవేటీకరణను పూర్తి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం, ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సరఫరాలో విశాఖ స్టీల్ ప్లాంట్ గణనీయమైన పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలోనైనా కేంద్రం ఆలోచిస్తుందని భావిస్తే వాటిని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోంది.
ప్రధాని ఇందిర హాయాంలో..
50 ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును గమనిస్తే ఏప్రిల్ 17,1970 న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పార్లమెంటులో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటును ప్రకటించారు. దీంతో ఈ ప్లాంట్ నిర్మాణానికి కురుపాం భూస్వాములు 6,000 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. జనవరి 20, 1971న ఇందిరా గాంధీ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారు చేసే బాధ్యతను మెస్సర్కు అప్పగించారు. ఎంఎన్ దస్తూర్ & కో సంస్థ 1977 అక్టోబర్లో తన నివేదికను ఇవ్వగా 1977లో జనతా ప్రభుత్వ హయాంలో రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి.
లక్షల మందికి పైగా ఉపాధి
ప్లాంట్ అభివృద్ధికి 1981లో భారత ప్రభుత్వం సోవియట్ రష్యాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.1990లో ఉక్కు తయారీ ప్రారంభమవగా మరో రెండేళ్లలోనే పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుతం 26,000 ఎకరాలకు పైగా విస్తరించిన ఉన్నఈ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులు. ప్లాంట్లో సుమారు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు,17,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా మరో లక్ష మంది విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు.
జగన్ సర్కారు స్టాండ్ ఏమిటి?
లక్ష మందికి పైగా జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయించడం సమంజసం కాదని, ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అని నేటికీ విశాఖలోని కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కార్మిక సంఘాలు ఆందోళనకు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం చేయబోతున్నారు. ఏపీ లోని రాజకీయ పార్టీలు,అధికారంలో ఉన్న జగన్ సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవడానికి ఏం చేస్తారానేది చూడాల్సి ఉంది.
Must Read ;- విశాఖ స్టీల్లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా











