అమరావతి రాజధాని అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలు హైకోర్టులో ఇవాళ క్వాష్ పిటీషన్ వేశారు. సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని వారి తరఫు న్యాయవాదులు పిటీషన్లో కోరారు. ఈ కేసు హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధానిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు, నారాయణలపై సీఐడీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. చంద్రబాబుకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విజయవాడ సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల ద్వారా తెలిపారు. విచారణకు హాజరు కాకపోయినా చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
హైకోర్టు తీర్పే కీలకం కానుంది..
సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటీషన్ కీలకంగా మారనుంది. రాజధాని భూముల కొనుగోళ్లు అమ్మకాల్లో ఎలాంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఓ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి కేసు మరల కోర్టుకు చేరింది. దీనిపై హైకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఈ కేసులో చంద్రబాబునాయుడును ఏ1గా, మాజీ పురపాలక మంత్రి నారాయణను ఏ2గా, ఇతర అధికారులను కూడా ఇందులో చేర్చినట్టు తెలుస్తోంది.
Must Read ;- సిల్లీ కేసులతో చంద్రబాబును భయపెట్టలేరు : టీడీపీ నాయకులు