అంతర్వేది.. ఈ పేరు వినగానే అందరికీ రధం గుర్తుకురాక మానదు. గతేడాది సెప్టెంబరు 5 అర్థాంతరంగా.. ఎటువంటి ప్రమాదం లేకుండా హఠాత్తుగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం అగ్నికి ఆహుతైంది. స్వామి వారి రథం ఆహుతవడం వెనుక కుట్ర ఉందా? ప్రమాదవశాత్తూ జరిగిందా? అనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఘటన జరిగిన సమయంలో అవి పనిచేయకపోడం, భద్రతా సిబ్బంది విధుల్లో లేకపోవడం చూస్తుంటే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై రాజకీయదుమారం చెలరేగింది. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భగ్గుమన్నారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు అప్పట్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
ఆగమేఘాలపైన సిద్దమైన కొత్త రధం..
హిందూ సంఘాలు, భక్తులు, ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబికడంతో.. ప్రభుత్వం తక్షణమే కొత్త రధం సిద్దం చేయిస్తామంటూ ప్రకటన జారీ చేసింది. ఆగమేఘాలపైన పనులు కూడా జరిపించింది. రధాన్ని ఆకర్షియంగా సిద్దం చేసింది. ఏడంతస్తులతో.. 6 చక్రాలతో.. 42 అడుగుల పొడవు.. 14 అడుగుల వెడల్పుతో.. రధం సిద్దమైంది. ఈ రథం సిద్దం చేయడానికి కోటి పది లక్షలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూడు నెలల వ్యవధిలోనే రథం సిద్ధం చేసింది ప్రభుత్వం. కొత్త రథానికి స్టీరింగ్, బ్రేకులు లాంటివి కూడా ఏర్పాటు చేసింది. కొత్త రథానికి ప్రత్యేకంగా ఇనుప గేట్లు ఏర్పాటు చేసి రక్షణను పెంచింది. పంచరంగులతో అందంగా ముస్తాబైన రథాన్ని సీఎం జగన్ స్వయంగా ప్రారంభించారు.

విచారణ సంగతేంటి?
ఇక ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. ప్రమాదం వెనుక కుట్ర ఉందా లేదా ప్రమాదవశాత్తూ జిరిగిందా అనే విషయాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్ 10న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదంతా జరిగి ఆరునెలలు దాటుతుంది. కానీ దర్యాప్తు ప్రారంభం కాలేదు. దీంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సీబీఐ దర్యాప్తు చేస్తుందా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది. సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నోరు మెదపకుండా ఉండిపోయింది. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే.. సీబీఐ దర్యాప్తు అనేది జరిగే అవకాశాలు కనిపించడం లేదు?
ఎందుకీ హడావిడి?
ఇంత హడావిడిగా రథం సిద్దం చేసి ప్రారంభించడానికి కారణాలు అనేకం అంటున్నారు విమర్శకులు. కొత్త రథం కళ్ల ముందు చూపింది.. విచారణ గురించి కనుమరుగు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కూడా తలెత్తక మానవు. అంతేకాదు.. అసలే గుడులపై దాడులు, విగ్రహాల విధ్వంసాల నేపథ్యంలో.. హిందూ వ్యతిరేకులు అనే అప్రదిష్టను మూటకట్టుకున్న ప్రభుత్వానికి ఈ అంతర్వేది రథ ప్రారంభోత్సవం అనేది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను కాస్త తగ్గించే ప్రయత్నాల్లో ఒకటిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరక్టర్ సంచలన వ్యాఖ్యలు










