తెలుగు తెరను ఎన్నో విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు ప్రభావితం చేశాయి. మనసు గోడలకి మంచి గంధంలా అద్దుకున్న అలాంటి ప్రేమకథా చిత్రాలలో ‘నిరీక్షణ’ ఒకటి. బాలు మహేంద్ర దర్శకత్వంలో భానుచందర్ .. ‘అర్చన’ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా, మరెన్నో ప్రేమకథలకు స్ఫూర్తిని ఇచ్చింది. ఆ సినిమాలో చారడేసి కళ్లతో అర్చన హావభావాలను పలికించిన తీరు, కుర్రకారు ప్రేక్షకులకు కుదురు లేకుండా చేసింది. ఆ తరువాత ‘లేడీస్ టైలర్’ ..’దాసి’ .. ‘మట్టిమనుషులు’ వంటి చిత్రాలు ఆమె ఖాతాలో చేరిపోయాయి.
‘అర్చన’ తన కెరియర్లో తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. మలయాళ .. హిందీ భాషా చిత్రాలలో నటించారు. ఆ తరువాత సినిమాలకి దూరమైన ఆమె, తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మెరిశారు. తన కెరియర్ గురించిన అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. “నా అసలు పేరు సుధ .. నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందుతున్న సమయంలో బాలుమహేంద్రగారిని కలిశాను. ‘నిరీక్షణ’ సినిమాతో నన్ను పరిచయం చేస్తూ, నా పేరును ‘అర్చన’గా ఆయనే మార్చారు.
Must Read ;- తమిళ సినీనటి ఖుష్బూ సుందర్ కారుకు ప్రమాదం
ఆరంభంలో నా స్టిల్స్ చూసిన వాళ్లు .. రెండు .. మూడు క్లోజప్ లు తీసినవారు నేను సినిమాలకి పనికిరానని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో బాలుమహేంద్రగారు నన్ను ప్రోత్సహించారు. ఆయన అవకాశం ఇవ్వడం వల్లనే నన్ను నేను నిరూపించుకునే అవకాశం కలిగింది. అందుకే ఆయనను నా గురువుగా భావిస్తుంటాను. భానుచందర్ తో వరుస సినిమాలు చేశాను .. సెట్లో ఇద్దరం దెబ్బలాడుకునే వాళ్లం .. సాయంత్రానికి కలిసిపోయేవాళ్లం. బాలుమహేంద్ర గారే మా మధ్య రాజీ కుదుర్చేవారు.
నేను నల్లగా వున్నానని ఎప్పుడూ ఫీల్ కాలేదు .. నల్లగా ఉండటం నా కెరియర్ కి మైనస్ అయిందని కూడా ఎప్పుడూ అనుకోలేదు. నిజం చెప్పాలంటే నల్లగా ఉన్నందుకు గర్వపడ్డాను. నేను కెమెరా ముందుకు రాక పాతిక సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్లీ ఇంతకాలానికి తెలుగు నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది. పెద్ద బ్యానర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఒక సినిమాలో, నా కోసం అనుకున్న పాత్ర నాకు నచ్చింది. త్వరలోనే షూటింగుకు వెళ్లే అవకాశాలు వున్నాయి. మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చారు.











