సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీలో తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న జగన్ సర్కారు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో మాత్రం వివాదాస్పదంగానే వ్యవహరిస్తోంది. అధికారుల బదిలీల మొదలు.. SEC మాట్లాడిన మాటల వరకు ప్రతి అంశంపైనా ఏదోరకంగా ఏపీలో రచ్చ అవుతూనే ఉంది. తనను ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు కొందరు వ్యక్తిగతంగా విమర్శించిన విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్కి శుక్రవారం ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపైన గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారును ఆపదవి నుంచి తప్పించాలని కోరారు. దీంతో వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శల దాడి మొదలైంది.
ప్రవీణ్ ప్రకాశ్ విషయంలో సీఎస్కు మరో లేఖ..
ఇక సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ ప్రకాశ్ను తొలగించాలని SEC రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాసిన విషయం తెలిసిందే.ఈ నెల 23న SEC నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్కి కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కాలేదు. ఇందుకు జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ కారణమని, యంత్రాంగాన్ని సన్నద్ధం చేయనందున షెడ్యూల్ వాయిదా వేయాల్సి వచ్చిందని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరారు. దీనిపై ప్రవీణ ప్రకాశ్ స్పందిస్తూ.. తాను ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకున్నానని, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అంశాలపై యథాతథ స్థితి అమలు చేశామని, ప్రభుత్వ ఆదేశాలే తప్ప తన నిర్ణయం కాదని సీఎస్కు లేఖ రాశారు ప్రవీణ్ ప్రకాశ్. అయితే, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ప్రవీణ్ ప్రకాశ్ ను తొలగించకపోవడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరో లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేశానని ఆయన అంగీకరించిన తర్వాత కూడా.. చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్గించే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ధిక్కరణ అవుతుందని పేర్కొంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోలేఖ రాశారు. ప్రస్తుతం ఈ వివాదం నడుస్తూనే ఉంది.
Must Read ;- సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?
సభా హక్కుల ఉల్లంఘన..
మరోవైపు ఎన్నికల కమిషనర్పై ఇన్నాళ్లు తీవ్ర విమర్శలు చేసిన సజ్జల, మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు ఎన్నికల సంఘంపై మరో అస్త్రాన్ని సంధించారు. ఎన్నికల కమిషనర్ పరిధి దాటి వ్యవహరించారని, సభా హక్కుల ఉల్లంఘన అవుతుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ కార్యాలయం వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలుస్తోంది. తరువాత నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రులు పలు ఆరోపణలు చేశారు. ఇక కడపలో పర్యటించిన SEC మాట్లాడుతూ వైఎస్ ఆశీస్సులు తనకు ఉన్నాయని వ్యాఖ్యానించడం, సీబీఐ కేసుల్లో సాక్షిగా ఉన్నానని చెప్పడం, ఏకగ్రీవాలపై కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ మంత్రులు SECపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ పలు ఆరోపణలు చేశారు.
కుల ధృవీకరణ పత్రాలపై రచ్చ..
ఇక పంచాయతీల్లో రిజర్వ్ అయిన స్థానాల నుంచి పోటీచేయాలంటే అవసరమైన కుల ధృవీకరణ పత్రాలపైనా ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య వార్ జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు నామినేషన్ వేస్తారన్న అనుమానంతో.. ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, ఆ ధృవీకరణ పత్రాలు లేనిదే నామినేషన్ వేసే అవకాశం లేదని, అధికార పార్టీ నేతలు యంత్రాంగాన్ని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాసింది. పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలను అనుమతించాలని, కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని ఒత్తిడి చేయకూడదని, కొత్త సర్టిఫికెట్ల సమర్పణకు నిర్ణీత సమయం ఇవ్వాలని అధికారులకు మార్గదర్శకాలు జారీచేయడంతో పాటు, పోటీ చేసేవారికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, అదే సమయంలో బకాయిల చెల్లింపులకు సంబంధించి క్లియరెన్స్ లు ఇచ్చే విషయంలో జాప్యం చేయకూడదని లేఖ రాసింది.
జగన్కి ఐవైఆర్ ఝలక్..
కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి బాసటగా నిలిచిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. సాధారణ సమయాల్లో సీఎం ఆదేశాలకు, క్యాబినెట్ ఆదేశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల సంఘ ఆదేశాలు కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉంటాయని ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో లోపాలుంటే సంబంధిత అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం మాత్రమే ఉంటుందని, అలా కాకుండా అమలు చేసేందుకు నిరాకరించడం నిబంధనలను అతిక్రమించడమే అవుతుందన్నారు. ప్రభుత్వంలోని కొందరి వల్ల అధికారులు సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం విచారకరమని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోందని చెప్పవచ్చు.
Also Read ;- నిమ్మగడ్డ చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి : సజ్జల