దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే లక్షా 84 వేలు కరోనా కేసులు నమోదయ్యాయి. 1027 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు దేశంలో 1,23,36,036 కేసులు నమోదు కాగా, 97 శాతం మంది కోలుకున్నారు. ఇంకా దేశంలో 13 లక్షల క్రియాశీల కేసులు ఉండటం, కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు రికవరీ రేటు కూడా తగ్గడంతో చనిపోయేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం నమోదవుతున్న కేసుల్లో 83 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ఘడ్, గుజరాత్, ఢిల్లీల్లోనే వస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మహారాష్ట్రలో లాక్ డౌన్ వేస్తారంటూ వస్తున్న వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా ఖండించారు.
మహా విళయం
మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే కరోనా కేసులు 60 వేలు దాటిపోయాయి. కరోనాతో ఒక్క రోజే మహారాష్ట్రలో 281 మంది చనిపోయారు. ఇప్పటికే రెండు టీకాలు అందుబాటులోకి వచ్చినా, సరిపడా సరఫరా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా టీకాల సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ టీకాలకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తోంది. రష్యాలో తయారు చేసిన స్పుత్నిక్ వీ టీకాకు అన్ని అనుమతులు మంజూరు చేశారు. కొద్ది రోజుల్లోనే ప్రజలకు మరో రెండు టీకాలు కూడా అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కరోనా టీకా ఉత్పత్తిని కూడా పెంచేందుకు కంపెనీలు కృషి చేస్తున్నాయి.
తెలంగాణలో పెరుగుతోన్న కేసులు
ఇటు తెలంగాణలోనూ రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒకే రోజు 2,157 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో 3లక్షల 7 వేల మంది కోలుకోగా, 25 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాబోయే నెల రోజుల్లో 30 లక్షల మందికి టీకా వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినా కరోనా టీకా మందు సరఫరా ఆ స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు 40 వేల మందికి మాత్రమే సరపడే టీకాలు సరఫరా అవుతున్నాయి. టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖకు అధికారులు లేఖ రాశారు. రాబోయే కొద్ది రోజుల్లో సరఫరా మెరుగుపడే అవకాశం ఉంది. ఓవైపు లక్షలాది మందికి టీకాలు వేయడంతోపాటు, కరోనా జాగ్రత్తలు పాటించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దం అవుతోంది.
ఏపీలో ఒకే రోజు 4 వేలకుపైగా కేసుల నమోదు..
ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది ఇప్పటికే ఏపీలో 9లక్షల 40 వేల మంది కరోనా భారిన పడ్డారు వీరిలో 97 శాతం మంది కోలుకున్నారు. 7 వేల మందికి పైగా కోవిడ్ కారణంగా చనిపోయారు. నిన్న ఒక్క రోజే 4 వేల మంది కరోనా భారిన పడ్డారు. ఇప్పటికే కరోనా తీవ్రంగా వ్యాపిస్తోన్న ప్రాంతాల్లో కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలులో లాక్ డౌన్ ప్రకటించారు. ఇక కరోనా రోగులతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చేయించుకునేందుకు కొందరు ముందుకు వస్తున్నా బెడ్లు దొరకడం లేదు. దీంతో కరోనా రోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం టీకా వేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇప్పటికే 2.20 లక్షల కరోనా టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరడంతో ప్రస్తుతానికి ఏపీలో టీకాల కొరత లేదనే చెప్పాలి. అయితే మరో రెండు రోజుల్లో మరలా 4 లక్షల టీకాలు అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు వెల్లడించారు. రాబోయే నెల రోజుల్లో కోటి మందికి కరోనా టీకాలు వేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. అయితే ఆ స్థాయిలో టీకా సరఫరా కావడం లేదు. రోజుకు 60 వేలకు మించి కరోనా టీకాలు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికీ 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే కరోనా టీకాలు వేస్తున్నారు. అన్ని వయసుల వారికి టీకా వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
విదేశీ టీకాలు అందుబాటులోకి..
ఇప్పటికే మన దేశంలోనే తయారు చేస్తున్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలతో పాటు రష్యాలో తయారైన స్పుత్నిక్ వి టీకాకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రష్యా కంపెనీలతో కలసి పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీల్యాబ్స్ త్వరలో స్పుత్నిక్ టీకాను ఉత్పత్తి చేయనుంది. ఇక బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తోన్న బయోకాన్ కంపెనీ తయారు చేసిన ముక్కుద్వారా ఇచ్చే టీకాకు త్వరలో అన్ని అనుమతులు రానున్నాయని తెలుస్తోంది. ఇక విదేశాల నుంచి కూడా మరో రెండు టీకాలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే దేశంలో 11 కోట్ల కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రోబోయే నెల రోజుల్లో మరో 12 కోట్ల టీకాలు వేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఓ వైపు టీకా వేసే కార్యక్రమాలు వేగవంతం చేస్తూనే, కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కట్టడి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఙప్తి చేశారు.
Must Read ;- తగ్గేది లే.. కొత్తగా 1.69 లక్షల కరోనా కేసులు