Devender Goud Will Join In Congress Soon :
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. పార్టీ సీనియర్లు, జూనియర్లను ఒకేతాటిపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ నిర్మాణం కోసం బలమైన అడుగులు వేస్తున్నారు. ఘర్ వాపసీతో పాటు ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఇటీవలే రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో కొండా సుముఖత చూపారు. సరైన సమయంలో పార్టీలో చేరుతానని స్పస్టం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి టి.దేవేందర్గౌడ్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ లోకి ఆహ్వానం
కాంగ్రెస్ నేతలు రేవంత్, మధుయాష్కీ ఆదివారం దేవేంద్ గౌడ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్, ఇద్దరు కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్ లను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు దేవేందర్ గౌడ్ ఫ్యామిలీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పక తప్పదు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఏకంచేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
టీడీపీ ఓ వెలుగు వెలిగి..
టీడీపీ హయాంలో దేవేందర్ గౌడ్ ఓ వెలుగు వెలిగారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేశారు. టీడీపీలో నెంబర్ 2 గా పేరు తెచ్చుకొని, క్రియాశీలకంగా పనిచేశారు. ఔటర్రింగ్రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలతో రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోని భూములకు డిమాండ్ పెరగడానికి దేవేందర్గౌడ్ పాటుపడ్డారని పేరుంది. టీడీపీలో ఉన్న దేవేందర్ గౌడ్ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 2008లో నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన మళ్లీ టీడీపీలో చేరారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
Must Read ;- రేవంత్ దూకుడు.. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు!











