ఏపీలో జగన్ పాలన మొదలయ్యాక నిజంగానే అరాచక పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పాలి. ఎక్కడికక్కడ తెగబడుతున్న వైసీపీ శ్రేణులు.. తమ పార్టీ నేతల అండ చూసుకుని ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నేతలపై విరుచుకుపడుతున్నాయి. అంతేకాకుండా తమకు అడ్డుగా ఉన్నారన్న భావనతో సొంత పార్టీకి చెందిన నేతలను కూడా మట్టుబెడుతున్న వైనం వైసీపీలో కలకలం రేపుతోంది. మంగళవారం నాడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి చెందిన సర్పంచ్ ను అదే పార్టీకి చెందిన మరో వర్గం దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ శ్రేణులు ఏకంగా హత్యాయత్నానికి దిగాయి. ఈ ఘటనలో దేవినేని సురక్షితంగానే బయటపడ్డా.. ఆయన కారు మాత్రం ధ్వంసమైంది. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి.
దేవినేనిపై హత్యాయత్నం
విజయవాడకు అతి సమీపంలో ఉన్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలు చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తల్లో నిజమెంత అన్న విషయాన్ని పరిశీలించేందుకు మంగళవారం దేవినేని తన అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడ చాలా సేపు పరిసరాలను పరిశీలించి దేవినేని తిరుగు పయనమయ్యారు. ఈ సమాచారం అందుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తన అనుచరులను ఉసిగొల్పారట. ఎమ్మెల్యే నుంచి సమాచారం రావడమే ఆలస్యం.. దేవినేనిపై దాడికి ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించిన వైసీపీ శ్రేణులు దేవినేనిపై దాడికి వ్యూహం రచించాయి. జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్దకు రాగానే.. అక్కడే కాపు కాసి ఉన్న వసంత అనుచరులు దేవినేని ఉమా వాహనంపై రాళ్ళ దాడికి దిగారు. ఈ దాడిలో ఉమా కూర్చున్న చోట కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. ఏకంగా ఒకే సారి వందలాది మంది దాడికి తెగబడటంతో దేవినేని షాక్ కు గురయ్యారు. అయితే అక్కడికి సమీపంలోనే టీడీపీ శ్రేణులు కూడా ఉండటంతో వారు దేవినేనిని వైసీపీ శ్రేణుల దాడి నుంచి కాపాడారు. ఈ దాడి ఘటన తెలిసినంతనే టీడీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు దేవినేనికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడి సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నా మిన్నకుండిపోవడంపై దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వసంతపై కేసు నమోదు చేయాలంటూ ఆయన పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
వైసీపీ సర్పంచ్ దారుణ హత్య
ఇదిలా ఉంటే.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని లింగాల మండలం కోమనూతల గ్రామ సర్పంచ్ గా ఇటీవలే ఎన్నికైన వైసీపీ నేత గడ్డం మునెప్పను అదే పార్టీకి చెందిన మరో వర్గం దారుణంగా హతమార్చింది. ఎన్నికల సమయంలో సర్పంచ్ పదవి కోసం వైసీపీలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. జగన్ సోదరుడు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సర్దిచెప్పినా గ్రూపు తగాదాలు వీడలేదు. సర్పంచ్ ఎన్నికల్లో మునెప్ప గెలవగా.. ఆయనపై కక్ష పెంచుకున్న ప్రత్యర్థి వర్గం ఆ రోజే గొడవకు దిగిందట. అయితే నాడు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారట. ఈ క్రమంలో మంగళవారం నాడు పులివెందులలో జరిగిన శిక్షణా శిబిరానికి హాజరై వేరే వ్యక్తి బైక్ పై తిరిగి వస్తున్న మునెప్పను గ్రామ శివారులోనే అటకాయించిన ప్రత్యర్థి వర్గం.. కత్తులు, కొవడళ్లతో దాడికి తెగబడింది. ఈ దాడిలో మునెప్ప అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరిన్ని గొడవలు జరక్కుండా గ్రామంలో పికెట్ను ఏర్పాటు చేశారు. ఇలా ఒకే రోజు వైసీపీ శ్రేణుల చేతిలో వైసీపీ సర్పంచ్ దారుణ హత్యకు గురికావడం, మరోవైపు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై ఏకంగా హత్యాయత్నం జరగడంతో కలకలం రేగింది.
Must Read ;- జగన్ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది!