డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థ, డీఆర్డీవో కలిసి అభివృద్ధి చేసిన కరోనా ఔషధం ‘2డీజీ (2 డీఆక్సీ డీగ్లూకోజ్)’ఈ రోజు నుంచి మార్కెట్లోకి అందుబాటులొకి వచ్చింది.ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థ అందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్లోకి విడుదల చేసింది. డీఆర్డీవోకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా ఈ 2డీజీ కరోనా మందును అభివృద్ధి చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మందు అత్యవసర వినియోగానికి మే 1న అనుమతులు మంజూరు చేసింది.రెండు నెలల ముందే ఈ మందును విడుదల చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రులకే అది అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులూ, వ్యవస్థలు, సంస్థలూ అందరూ కొనుగోలు చేసేలా మార్క్ట్లోకి విడుదల చేసింది.
ఒకో ప్యాకెట్ రూ.990
ఒక ప్యాకెట్ ధర రూ.990 అని, దీనిలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలకు సబ్సడీ ధరలకు ఇస్తామని, ఔషధ స్వచ్ఛత 99.5 శాతమని రెడ్డీస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు మందును సరఫరా చేస్తామని ప్రకటించింది. తొలుత మెట్రో నగరాలు,పెద్ద పట్టణాలకు సరఫరా చేస్తామని,ఆ తర్వాత ఉత్పత్తిని పెంచి అన్ని ప్రాంతాలకూ పంపిణీ చేస్తామని వివరించింది. ఈ ఔషధం కావాల్సిన వారు [email protected]కు మెయిల్ చేయవచ్చని చెప్పింది.
కరోనాపై పోరులో..
కొవిడ్ సోకిన పేషెంట్లపై 2డీజీ ఔషధ పరిశోధనల కోసం తమ దీర్ఘకాలిక భాగస్వామి డాక్టర్ రెడ్డీస్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి చెప్పారు. కరోనా చికిత్స కోసం వివిధ సాంకేతికలను వినియోగంలోకి తీసుకొచ్చి కరోనాపై పోరులో తమ వంతు సాయమందిస్తున్నామన్నారు. ఇప్పటికే తమ పోర్ట్ ఫోలియోలో కొవిడ్ వ్యాక్సిన్ ఉందని, ఇప్పుడు 2డీజీ మందు రూపంలో మరొకటి వచ్చి చేరిందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. కరోనా నివారణకు డీఆర్డీవోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.
.Must Read ;- విస్తరిస్తున్న‘డెల్టా ప్లస్’.. కరోనా నిబంధనల్లో అజాగ్రత్త తగదు