కిలో కూరగాయలు ధర రూ.40 దాటితే…. గగ్గోలు పెడతాం. కూరగాయలు కొనలేం తినలేం అనే నిట్టూర్పులు వింటూనే ఉంటాం. కానీ టమోటో పంట పండించే రైతుకు కిలోకు 30 పైసలు కూడా దక్కకపోయినా ఒక్కరు కూడా నోరు తెరవరు. రోడ్డెక్కి గగ్గోలు పెట్టరు. రైతు వేల రూపాయల పెట్టుబడిపెట్టి, స్వేదం చిందించి టమోటో సాగు చేస్తే చివరకు కిలో 30 పైసలకు కూడా కొనేవారు లేక రోడ్లపై గుమ్మరించాల్సిన దుస్థితి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏర్పడింది. ఇప్పటికీ వినియోగదారులు కిలో టమోటో రూ.13 నుంచి 24 కు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. కానీ అందులో రైతుకు పదోవంతు కూడా దక్కడం లేదంటే ఈ వ్యవస్థలో వ్యవసాయదారుడు ఎంత దగాకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
రోడ్డుపై పారబోసి నిరసన
ఏపీలో టమోటో కొనే నాధుడే లేదు. పంట సాగు ఖర్చులు రాకపోగా కనీసం కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కర్నూలు, అనంతపురం జిల్లా రైతులు రోడ్లపై గుమ్మరిస్తున్నారు. ధరలు పతనం అయినప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు రూ.3000 కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పిన సీఎంకు టమోటో రైతుల వ్యథ పట్టడం లేదు. కనీసం ఈ రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కిలో పది రూపాయలకు కొనుగోలు చేసి రైతు బజార్లలో రూ.15కు అమ్మినా వినియోగదారుడుకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధరలు పతనం చేసి దళారులు రైతుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు.
ఎందుకింత దారుణం
కర్నూలు జిల్లా దేవనకొండలో టమోటో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కిలో టమోటా ధర 30 పైసలకు పడిపోవడంతో రైతులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. కూలీ ఖర్చులు, ఇంటికి వెళ్లడానికి ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. అయినా వ్యవసాయ మంత్రికి గానీ, ప్రభుత్వ అధికారులకు కానీ చీమకుట్టినట్టు కూడా లేదంటున్నారు. రైతుల వద్ద పైసల్లో కొనుగోలు చేసిన టమోటోలను విజయవాడ రైతు బజార్లో కిలో రూ.13కు విక్రయిస్తున్నారు. ధరలు పెరిగితే బీపీ పెంచుకునే రాజకీయ నాయకులు ఎవరూ టమోటో రైతుకు మద్దతుగా నిలవకపోవడం శోచనీయం.
ఎందుకీ దుస్థితి…
కూరగాయలను రైతులు ఎక్కువగా దళారులకే అమ్ముతూ ఉంటారు. గ్రామాల నుంచి దూర ప్రాంతాల్లోని నగరాలకు వెళ్లి అమ్ముకునే వెసులుబాటు రైతులకు ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు రెచ్చిపోతున్నారు. మార్కెట్కు ఏదైనా సరకు ఎక్కువగా వచ్చిందని గమనించగానే అందరూ కూడబలుక్కుని వాటి ధరలను పతనం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మార్కెట్లోకి ప్రవేశించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కిలో టమోటో 30 పైసలకు పతనం అయినా అక్కడే ఉన్న మార్కెట్ అధికారులు పట్టించుకోలేదు. దళారులు మాత్రం వాటిని నగరాలకు తరలించి కిలో రూ.13 నుంచి రూ.23 దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
Must Read ;- రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే