Financial Crisis In Andhra Pradesh :
ఓ వైపు ఏపీలో సంక్షేమ పథకాలకు ఉదారంగా నిధులిస్తున్న జగన్ సర్కారు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లింపుల కోసం ప్రతి నెల ఎతుక్కోవలసిన పరిస్థితి. 10 తేదీ వచ్చినా ఇంత వరకు ఉద్యోగులకు గత నెల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లించలేదు. గతంలో ప్రతి నెల 1వ తేదీ నాటికి ఠంచనుగా జీతాలు, పెన్సన్లు అందేవి. ప్రస్తుతం ఎప్పుడు అందుతాయో తెలియని గందరగోళ పరిస్థితులున్నాయని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఏపీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి ఈ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. గతంలో ఏపీ సిఎస్గా పనిచేసిన ఒకాయన వాట్సాప్ గ్రూప్లో పెన్షన్పై మెసేజ్లు పెట్టారు.ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆయనకు నిన్న సాయంత్రం జమ చేసినట్లు తెలుస్తోంది.
అప్పుల వడ్డీలకే ..
ఏపీలో నెల నెల పెరుగుతున్న అప్పులతో వాటికి చెల్లించాల్సిన వడ్డీల భారం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఒకటో తేదీ నుంచి ఐదో తేదీకి చేరిన చెల్లింపులు ప్రస్తుతం పదో తేదీకీ కూడా పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నారు. ఎప్పుడిస్తారో కూడ వారికి సమాధానం చెప్పేవారు కూడా లేకుండా పోయారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లు సకాలంలో రాకపోవడం, ఏపీలో సంక్షేమం పేరిట సాగుతున్న విచ్చలవిడి పంపకాలు, కొన్ని శాఖల్లో దుబారా ఖర్చులు వెరసి ఉద్యోగులు, పెన్షనర్ల ఇబ్బందులకు కారణమవుతున్నాయి.
Financial Crisis In Andhra Pradesh :
నెలనెలా ఎదురు చూపులే..
నెలంతా కష్టపడిన ప్రభుత్వ ఉద్యోగులు జీతం వచ్చే రోజు కోసం ఎదురు చూడటం సాధారణం. గతంలో ప్రతి నెల ఒకటో తేదీకల్లా ఠంచనుగా జీతాలందేవి. దీంతో బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలను అందుకు అనుగుణంగా ఉద్యోగులు ప్లాన్ చేసుకునే వారు. ఆ తర్వాత అయిదో తేదీ వరకు పొడిగించిన జీతాలు చెల్లింపులు ప్రస్తుతం 10 తేదీ వచ్చినా అందరికీ అందలేదు. దీంతో తమపై పెనాల్టీల భారం కూడ పడుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఎప్పుడు ఇస్తారో కూడ కచ్చితంగా ఎవరూ చెప్పటం లేదని వారు వాపోతున్నారు.
ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం
ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించక పోయినా నోరు మొదపడం లేదంటూ ఉద్యోగ సంఘాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రభుత్వంతో అంటకాగటమే దీనికి కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో పీఆర్సీ, ఐఆర్, హెచ్చార్సీ, డీఏ వంటి విషయాలపై ప్రభుత్వంపై సంఘాలు పోరాటాలు చేసేవి. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వాల దయతో బతికేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్యోగులు, పెన్షనర్ల ఘోష పట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికే డీఏ బకాయిలతో పాటు ఇతర భత్యాలు కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం భారీగా బకాయి పడింది. పీఆర్సీ గడుపు దాటి చాలా కాలమైంది. అయినా ఇప్పటికీ ప్రభుత్వం దాని ఊసెత్తకపోయినా ఉద్యోగ సంఘాలు నోరు మెదపలేని పరిస్థితి.
సంక్షేమ పథకాలతో ఎక్కువ మందికి లబ్ధి : బుగ్గన రాజేంద్రనాథ్
ప్రస్తుతం కరోనాతో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలు వల్లే జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్ధితి వచ్చిందని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బకాయిలు మరో రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తామని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.
Must Read ;- అప్పు ప్లీజ్.. జగన్ అభ్యర్థనకు కేంద్రం నో











