సర్వాంగ సుందరంగా ముస్తాబైన సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ ఒక్క సంఘటనతో తెలంగాణలో ప్రభుత్వ విద్య కార్పొరేట్ విద్యకు ఏమాత్రం తీసిపోదని అధికార పార్టీ చెబుతోంది. స్వయంగా కేటీ రామారావు సైతం ఇదే విషయాన్ని వేదికపై పునరుద్ఘాటించారు. అయితే… తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? సర్కారీ విద్య ఏ పరిస్థితిలో ఉంది? అనేదానిపై ‘ది లియో న్యూస్’ విశ్లేషణాత్మక కథనం…
విద్యా ప్రమాణాల్లో మన స్థానమెంత?
ఒక దేశాభివృద్ధికి చదువే అసలైన కొలమానం. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, చైనా.. ఆ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అక్కడ వందశాతం అక్షరాస్యతే అసలైన కారణం. మరి.. అటువంటి విద్యావ్యవస్థ బలోపేతానికి తెలంగాణ తీసుకుంటున్న చర్యలేంటి? అని మేధావులను ప్రశ్నిస్తే.. ఆగ్రహం, అసహనమే ఎదురవుతోంది. దక్షిణాదిలో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నది తెలంగాణలోనే అనేది కాదనలేని సత్యం. ప్రాథమిక విద్యా ప్రమాణాల్లో దేశంలో తెలంగాణ 19వ స్థానంలో ఉందంటే.. పరిస్థితి ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది.
Must Read ;- కేసీఆర్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగులు
ఇదీ మన విద్యారంగ దుస్థితి…
ఒకప్పటితో పోల్చుకుంటే.. తెలంగాణ బడ్జెట్ గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. అయితే.. అందులో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు మాత్రం తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 10% నిధులు కేటాయించేవారు. తెలంగాణలో ఏటా తగ్గిస్తూ 2020 – 21 వచ్చేసరికి 6% నిధులే ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలనేది విద్యారంగ నిపుణులు చెబుతున్న మాట. 2020–21లో విద్యా శాఖ రూ.18 వేల కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లనే కేటాయించింది. ఈ అరకొర నిధుల్లో 85-90% సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయి. ఫలితంగా… సర్కారీ స్కూళ్లు సమస్యలతో సతమతం అవుతున్నాయి.
దినదినగండం.. నూరేళ్లాయుష్షు…
దినదినగండం.. నూరేళ్లాయుష్షు అన్నట్టు ఉంది మన బడుల భవిష్యత్తు. ఆపద ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. గోడలు బీటలు వారి.. కప్పులకు రంధ్రాలు పడి.. పగుళ్లు తేలి ఎప్పుడు కూలి కిందపడతాయోనని తెలియని దుస్థితి. వానొస్తే కురుస్తూ.. ఎండొస్తే ఎండుతూ… చదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల ఇప్పటికీ అసలు పక్కా భవనమే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి బడుల్లో చదువు సాగేదెట్టా.. అనేది అందరి మదిని తొలిచేస్తున్న ప్రశ్న?
Also Read ;- ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్
హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో 1866లో నిర్మించిన గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ పైకప్పు ఇటీవలే కూలింది. కరోనాతో పాఠశాలలకు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఆ బడిలో సుమారు 400 వంది చదువుకుంటున్నారు. ఆ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్, మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమారుడు పీవీ రంగారావుతోపాటు ప్రస్తుత ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఎందరో విద్యనభ్యసించారు. ఆ బడికి మరమ్మతులు చేయాలని గతేడాది నవంబర్లోనే హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్డ్ అండ్ కల్చర్ హెరిటేజ్ (ఇంటాక్) ప్రతినిధులు చెబుతున్నారు. ఓ రాష్ట్రపతి, ఓ ముఖ్యమంతి స్థాయి వారు చదివిన బడికే ఈ దుస్థితి పట్టిందంటే.. ఇక మిగతావాటి దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది?
ఆ మాట అపహాస్యమే కదా?
తెలంగాణలో 26,050 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, వీటిలో 18,230 ప్రైమరీ, 3,179 అప్పర్ ప్రైమరీ, 4,641 హైస్కూల్స్ ఉన్నాయి. వీటిలో 24 లక్షల మంది స్టూడెంట్లు, 1,41,343 మంది టీచర్లు ఉన్నారు. ప్రస్తుతం సర్కారీ బడుల్లో 32 వేల టీచర్ పోస్టులు, 5 వేల క్రాఫ్ట్, ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 4 వేల కంప్యూటర్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ తరుణంలో గివ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ’ సహకారంతో రూ.3 కోట్లతో ఈ పాఠశాలను చూపించి… కార్పొరేట్ విద్యకు సర్కారీ విద్య ఏ మాత్రం తీసిపోదనే స్టేట్ మెంట్ ఇచ్చేయడం అంటే.. అపహాస్యమే కదా?