ఒకరు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రం పరిధిలోకి తేవాలని కేసు వేసి వాదిస్తున్న వారు.. మరొకరు టీటీడీనీ మొత్తం తన మనుషులతో నింపేసి.. అది రాష్ట్రం కిందే ఉంచాలని పట్టుదల మీద ఉన్నవారు.. కాని వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఆ షిప్ చాలా వేగంగా దూసుకుపోతోంది. ఎంతగా అంటే ఒకరినొకరు పొగుడుకునేంతగా.. మరి ఆయన కేసు వదిలేస్తారా… లేక వీరు టీటీడీని వదిలేసుకుంటారా.. అంటే ఏదీ జరగదనే చెప్పాలి. అయినా ఒకరికొకరు అవసరాలు తీర్చుకోవడానికే చేయి కలపారని వేరే చెప్పనక్కర్లేదు. ఒకరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మరొకరు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.
పరస్పర కితాబులు
అవును..వీరిద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు. జగన్ పాలన సూపర్గా ఉందని.. టీటీడీ ఆయన హయాంలో చాలా బాగా పని చేస్తోందని.. తిరుమలలో దేవస్థానం చాలా బాగా నడుస్తోందని సుబ్రమణ్యస్వామి కితాబిచ్చారు. ఇక మన సీఎంగారు బయట మాట్లాడరు కాని తన మనుషులతో అయితే స్వామివారిని పొగిడించారు…పైగా తిరుమల వచ్చిన స్వామివారికి స్వామివారి సేవలు చాలా మర్యాదగా అందించారు…దగ్గరుండి మరీ స్పెషల్ వీఐపీ ట్రీట్ మెంట్ ఇచ్చారు.
ఆరోపణలకు బ్రేక్
సుబ్రమణ్యస్వామి కోర్టులో కేసు వేశారు. అదేంటంటే.. ప్రపంచం మొత్తం నుంచి భక్తులు వచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఎందుకుండాలి.. అన్ని ఆస్తులున్న దేవస్థానాన్ని ఎలా పరిరక్షిస్తారు.. దానిని కేంద్రం తీసుకుని.. ఒక ట్రస్టు ఆధ్వర్యంలో నడిపించాలని కేసు వేశారు. అది దాదాపు వాదనలు పూర్తయి.. జడ్జిమెంట్ దాకా వచ్చింది. ఇంకా జడ్జిమెంట్ రావాల్సి ఉంది. అప్పటికి సార్ టీటీడీపై చాలా ఆరోపణలు చేశారు.. జగన్ సీఎం అయ్యాక కూడా దానిని కొనసాగించారు. కాని ఇప్పుడు మాత్రం ఆ ట్రెండ్కు బ్రేకేశారు. ట్రెండ్ మార్చేశారు. ఎందుకు
మ్యాటర్ సెటిల్ చేసే బాధ్యత..
సుబ్రమణ్యస్వామి కేసులు ఎందుకు వేస్తారో.. తర్వాత ఎలాంటి పలితం పొందుతారో అందరికీ తెలిసిందే. అలాగే కేసులు వేయకుండానే జగన్ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందే ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. టీటీడీలో అన్యమత ప్రచారం.. ఆస్తులు అమ్మే ప్రయత్నం చేయడం.. వంటివి వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్ అయ్యాక ఆరోపణలు చాలా వచ్చాయి. అయితే వాటన్నిటిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర ధార్మిక సంస్థలు గుర్రుగా ఉన్నాయి. వాటన్నిటిని చల్లబరిచి.. వారందరినీ కన్విన్స్ చేసి.. మ్యాటర్ సెటిల్ చేసే బాధ్యత సుబ్రమణ్యస్వామికి అప్పచెప్పినట్లు సమాచారం. ఈ కన్సల్టెన్సీ ఉచితంగానా లేక .. ఫీజు ఉందా అనేది ఎవరికీ తెలియదు.
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ?
అయితే స్వామివారికి మరో బెనిఫిట్ వైసీపీ అందించబోతోందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే స్వామి రాజ్యసభ సభ్యత్వం పూర్తి కాబోతుంది. బీజేపీని ఒప్పించి.. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం పొందేందుకు ఒప్పందం కుదిరినట్లు టాక్. ఇప్పటికే ఒకసారి అండర్ స్టాండింగ్తో బీజేపీ, వైసీపీలు కలిసి అంబానీ మనిషి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. అదే తరహాలో సుబ్రమణ్యస్వామికి కూడా ఇవ్వాలనేది ప్రతిపాదన.. దాదాపు కన్ఫామ్ అని కూడా అంటున్నారు. అలాగే కొరకరాని కొయ్యగా తయారైన ఆంధ్ర్రజ్యోతిని దెబ్బతీయటానికి స్వామి ద్వారానే పరువు నష్టం కేసు వేయించారు. అదే కథనాన్నిఅన్ని మీడియా సంస్థలు ప్రచురించినా.. దీని మీదే కేసు ఎందుకు వేశారని అడిగితే.. అది మాత్రమే తాను అనువాదం చేయించుకుని చదివానని.. అందుకే దాని మీదే కేసు వేశానని స్వామివారు సెలవిచ్చారు. దీని పరమార్ధం ఏంటో మీకర్ధమవుతుందిగా.
Also Read : జగన్ మరింత స్పీడు అవుతారా.. మున్ముందు మరింత దారుణం?