మా జగన్ అన్న..అసలు మాట తప్పడు..మడమ తిప్పడు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, రామాయపట్నం..ఇలా ఏ విషయంలోనైనా పోరాడాలి. 23మంది ఎంపీలం ఉన్నాం.. మోదీపై పోరాటం చేయాల్సిందే..
– సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న కొన్ని కామెంట్లు ఇవీ.
ఈ కామెంట్లను కూడా వ్యతిరేకించేవారు ఉన్నా.. అసలు ఈ కామెంట్లు ఎందుకు వస్తాయనే విషయానికి వస్తే.. విశాఖ స్టీల్ విషయంలో రాష్ట్రానికి వాటానే లేదు అని తేల్చేసింది కేంద్రం. ఇప్పటికే పోలవరం నిధుల విషయంలో రాష్ట్రానికి దాదాపుగా హ్యాండిచ్చినంత పనిచేసేసింది. తాజాగా రామాయపట్నం పోర్టుకి తాము నిధులివ్వలేమని చెప్పేసింది. మొత్తం మీద.. ఏపీ విషయంలో తాము సాయం చేసేందుకు సిద్ధంగా లేమని డైరెక్ట్గా చెప్పకుండా..మీరే అర్థం చేసుకోవాల్సి అన్నట్లుగా చెప్పేసింది కేంద్రం.
డీగ్రేడ్ చేయడంతోనే..
రామాయపట్నం పోర్టు నిర్మాణ విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. పేరుకే ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు పేరు చెబుతున్నా.. భూసేకరణలో నెల్లూరు జిల్లాలోని ప్రాంతాలే ఎక్కువగా ఉండడంపై ఇప్పటికే అక్కడ రచ్చ నడుస్తోంది. అదీ చాలదన్నట్లు గతంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం..ఇప్పుడు మిస్ ఫైర్ అయిందని చెప్పవచ్చు. విభజన చట్టంలో దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి బదులు..రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు కావాలని కోరింది. అంతవరకు ఆగితే బాగుండేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలే ఫైనల్ అని చెప్పే రీతిలో ఆ పోర్టును నాన్ మేజర్ పోర్టుగా డీగ్రేడ్ చేస్తూ గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిందనే చర్చ మొదలైంది. మేజర్ పోర్టులకు కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పోర్టుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో కేంద్రానికి కూడా సమాచారం పంపడంతో పాటు కేంద్రాన్ని కూడా భాగస్వామిని చేయాల్సి ఉంటుంది. అయితే ఆ అవకాశం లేకుండా జగన్ సర్కారు రామాయపట్నం మేజర్ పోర్టును నాన్ మేజర్ పోర్టుగా డీగ్రేడ్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. తరువాతి కాలంలో పోర్టు నిర్మాణం పూర్తయ్యక.. నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకి అప్పజెప్పేలా నిర్ణయం తీసుకుందని విమర్శలున్నాయి.
Must Read ;- విశాఖ స్టీల్లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా
అరబిందో రియాల్టీకి బాధ్యతలు..
కాగా, గతంలోనే రూ.14,000 కోట్ల అంచనాతో రెండు దశల్లో సొంతంగా ఈ పోర్టును చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా అందులో కొన్ని పనులను ప్రైవేటుకి అప్పగించారు. ఇప్పటికే అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,634 కోట్లకు బిడ్ దాఖలు చేసి నిర్వహణా పనులను దక్కించుకుందని తెలుస్తోంది. తాజాగా మోదీ సర్కారు హ్యాండ్ ఇవ్వడంతో ఆ భారం మొత్తం రాష్ట్ర సర్కారుపైనే పడనుందని చెప్పవచ్చు.
కేంద్రం చెప్పింది ఇదీ..
ఏపీలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధుల కేటాయింపుపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ మేజర్ పోర్టులకు మాత్రమే కేంద్ర సాయం చేస్తుందని, రామాయపట్నం పోర్టు తమ పరిధిలో లేదని వ్యాఖ్యానించారు. మేజర్ పోర్టు కానందున తాము నిధులిచ్చేది లేదని తేల్చారు. దీంతో ఒకే రోజు కేంద్రం నుంచి రెండు షాక్ లు తగిలాయని చెప్పవచ్చు. విశాఖ ఉక్కు కర్మాగారంలో రాష్ట్ర వాటా లేదని తేల్చేసిన కేంద్రం, కచ్చితంగా ప్రైవేటు పరం చేస్తామని చెప్పేసింది. ఇక రామాయపట్నం పోర్టు విషయంలో నిధులు ఇవ్వలేమని సూటిగా స్పష్టత ఇచ్చింది.
Also Read ;- జీవీఎల్ వ్యాఖ్యలతో రగిలిపోతున్న ఓటర్లు.. విశాఖలో బీజేపీ అడ్రస్ గల్లంతేనా?