Jagan Wipes Face With Mask Goes Viral In Social Media :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజంగానే డిఫెన్స్ లో పడిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఓ వైపు కోర్టు కేసులు, కోర్టు అక్షింతలు, మరో వైపు తాను తీసుకుంటున్న అప్పులపై కేంద్రం కొర్రీలు, వివరణలు కోరుతూ రాస్తున్న లేఖలు.. ఇంకో వైపు రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న నేరాలు.. ప్రత్యేకించి మహిళలపై పెరుగుతున్న దురాగతాలతో జగన్ కు దిక్కు తోచడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకేసారి ఇన్నేసీ తలనొప్పులు తట్టుకోవడం సాధ్యం కాదు కదా.. అందుకే జగన్ తానేమి చేస్తున్నానన్న విషయాన్ని కూడా ఆయన మరిచిపోయినట్లున్నారు. కరోనా వైరస్ సోకకుండా ముఖానికి పెట్టుకునే మాస్కుతోనే ఆయన తన ముఖానికి పట్టిన చెమటను తుడిచేసుకున్నారు. సోమవారం నాడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరంలో కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
కరోనాపై తనదైన శైలి కామెంట్లు
ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన కరోనా వైరస్ పై ఏపీ సీఎం హోదాలో జగన్ ఎలా స్పందించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే సరి., కరోనా పరారేనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఓ వైద్యుడి కుమారుడిగా.. 5 కోట్ల మంది ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన సీఎం హోదాలో ఉండి.. ఇలా కరోనా నివారణ పట్ల తేలికపాటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నాడు జగన్ పై విమర్శలు పోటెత్తాయి. ఆ తర్వాత కూడా ఆయన తన వైఖరిని మార్చుకున్న దాఖలా కనిపించలేదు. సమీక్షల పేరిట తన వద్దకు వచ్చే అధికారులు అంతా ముఖానికి మాస్కులు పెట్టుకున్నా.. జగన్ మాత్రం మాస్కు వాడలేదు. అంతేనా.. ఏకంగా బహిరంగ సభల్లోనూ మాస్కు లేకుండానే జగన్ కనిపించారు. అడపాదడపా మాస్కుతో కనిపించినా.. జగన్ మాస్కు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ క్రమంలో మాస్కుతో ముఖం తుడుచుకుంటున్న జగన్ ఫొటో వైరల్ అయిపోయింది.
విమర్శల జడివానే కారణమా?
రాష్ట్రంలో మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని జగన్ పదే పదే చెబుతున్నా.. రాష్ట్రంలో మాత్రం నానాటికీ మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఆదివారం గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యపై జరిగిన ఉన్మాది దాడి, ఆ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోవడం జగన్ సర్కారును మరింత డిఫెన్స్ లో పడేసిందన్న మాట వినిపించింది. ఈ ఘటనపై తనదైన శైలిలో స్పందించిన టీడీపీ జగన్ సర్కారును తూర్పారబట్టింది. టీడీపీ ఆందోళనలను నిలువరించే క్రమంలో పోలీసులు ఏకంగా నారా లోకేశ్ ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. అదే సమయంలో ఇదెక్కడి తలనొప్పిరా బాబూ అంటూ జగన్ తన ముఖానికి ఉన్నది ఏమిటన్న విషయాన్ని కూడా చూసుకోకుండా ముఖానికి పెట్టుకున్న మాస్కును తీసుకుని చెమటను తుడుచుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు జగన్ తీరుపై సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు.
Must Read ;- నారా పిడికిలి యమా స్ట్రాంగ్ గురూ!