దేశంలో ‘జమిలి’ ఎన్నికల అంశానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశమంతా ‘వన్ నేషన్..వన్ ఎలక్షన్’కు వీలుగా సిద్ధం అవ్వాలనే విధంగా సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించడానికి తాము రెఢీ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంతో మళ్లీ చర్చ మొదలైంది. ‘‘జమిలి ఎన్నికలకు మేం సిద్ధమే. ఈ అంశంపై పార్లమెంట్లో విస్తృతమైన సవరణలు అవసరం. అవి చేశాక జమిలి ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధమే.’’ అని సునీల్ అరోరా ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల సదస్సుకు హాజరైన మోడీ..ఇదే విషయంపై మాట్లాడారు. దేశంలో పలుచోట్ల ఎన్నికలు జరుగుతుండడం, కొన్ని సార్లు అర్థంతరంగా ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధికి విఘాతంగా మారిందని వ్యాఖ్యానించారు. దీనిపై చర్చ జరగాలని మోడీ అభిప్రాయ పడ్డారు.
వ్యతిరేకించిన పార్టీలు కూడా..
ఇక గతంలో ‘జమిలి’ ఎన్నికలను వ్యతిరేకించిన పార్టీలు కూడా ఇప్పుడు సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు దేశం సిద్ధం కావాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అధికార వైసీపీ గతంలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది. తాజాగా పార్టీ స్టాండ్ ఏంటనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రంతో ఉన్న సంబంధాలు, అవసరాల నేపథ్యంలో వైసీపీ ‘జమిలి’ ఎన్నికలను వ్యతిరేకించే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ విషయానికి వస్తే..ఇటీవలే ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. జమిలి ఎన్నికలు తప్పవు అన్నట్లుగా మాట్లాడారు. అంటే రెండు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలకు వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. అంతే కాకుండా.. లోక్సభ ఎన్నికలు జరిగే సమయానికి అటూఇటూగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా ఎమ్మెల్యేలకు పెద్దగా నష్టం ఉండదనే చర్చ నడుస్తోంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉన్నా.. ఇతర రాష్ట్రాల శాసనసభల ఆమోదం ద్వారా దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికలు జరిపేలా పార్లమెంటులో నిర్ణయం తీసుకునే వీలుంది. రాజ్యాంగ సవరణలు, ఆమోదం విషయానికి వస్తే.. లోక్సభలో బీజేపీకి మెజార్టీ ఉంది. రాజ్యసభలో మరికొందరు సభ్యుల మద్దతు ఎన్డీయేకి అవసరం. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాజ్యసభలోనూ గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. న్యాయ సమీక్ష విషయానికి వస్తే.. కేంద్రం ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు చేసింది. 2016 నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. మొత్తం మీద ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునిల్ అరోరా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది.
Must Read ;- శీతాకాల సమావేశాల రద్దు వెనుక ఏ ‘ఆందోళన’..

2022 నుంచి 2024 మధ్యలో ఎప్పుడైనా..
ఇక జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై భిన్నవాదనలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి ఆమోదం, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, సాయుధ బలగాల తరలింపులు లాంటి ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే.. కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. అంటే 2022 చివరికి లేదా 2023 తొలినాళ్లకి సాధ్యమవుతుంది. అంటే..2022-2023 మధ్య కాలంలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఆరు నెలలకు మించకుండా ఉండేలా గవర్నర్ల పాలన, రాష్ట్రపతి పాలన పెట్టడం లేదా ఆపద్ధర్మ ప్రభుత్వాలను కొనసాగించడం లాంటి అంశాలు కేంద్రం ముందు ఉన్నాయి. రాజకీయంగా విమర్శలు రాకుండా ఉండేందుకు మాత్రమే ఈ అంశాలను పరిశీలించవచ్చు.ఇక తాము ఎంత ఒప్పించినా.. అంగీకరించేందుకు వీల్లేని మమతా బెనర్జీ (టీఎంసీ), కాంగ్రెస్ తదితర పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు అడ్డుకోలేని విధంగా దేశంలో ఏకాభిప్రాయ అంశాన్ని తెరపైకి తేవచ్చు. ఇదే జరిగితే.. తెలంగాణతో పాటు ఏపీ (ప్రత్యేక పరిస్థితులు తలెత్తితే తప్ప) 2023 తొలినాళ్లలోనే ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read ;- మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు











