తెలుగు నేల రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా బూతు పురాణం వినిపిస్తోంది. అటు ఏపీలో విపక్షాలపై బూతులతో విరుచుకుపడేందుకే ఓ నేతకు మంత్రి పదవి ఇచ్చారన్న దిశగా సెటైర్లు పడిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. మొన్నటిదాకా ఓ మోస్తరుగానే ఉన్న మాటల దాడి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బండి సంజయ్ కు దక్కడంతో కొంత వాడీవేడీ పెరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక.. ఆ దాడి తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. అంటే.. వీరిద్దరి రాకతో, వీరిద్దరి కారణంగానే తెలంగాణ రాజకీయాల్లో కూడా తిట్ట పురాణం మొదలైందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. సీఎం హోదాలో కేసీఆర్.. విపక్షాలపై ఆది నుంచి తనదైన శైలిలో తిట్ల పురాణం వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు పోటీగా బండి, రేవంత్ లు కూడా తిట్లు వల్లె వేస్తుండటంతో ఇప్పుడు ఏ నేత నోరు తెరచి వైరివర్గాలను టార్గెట్ చేసినా.. బూతులు, తిట్లు, శాపనార్థాలే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల తిట్లను భరించడం సాధ్యం కాని టీఆర్ఎస్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లుగా ఉంది.
బూతులు మాట్లాడితే అరెస్టులే!
రాజకీయ పార్టీల మధ్య కొనసాగుతున్న తిట్ల పురాణంపై.. ప్రత్యేకించి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు దాడి చేసే వారికి హెచ్చరికలు ఇచ్చేందుకన్నట్లుగానే శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మీడియా ముందుకు వచ్చారు. తొలుత ఏవో పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడేందుకే వచ్చినట్లుగా కనిపించిన కేటీఆర్.. ఆ తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టారు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ పై కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది సరికాదని ముందుగా కాస్తంత శాంతంగానే మాట్లాడిన కేటీఆర్.. ఆపై స్వరం పెంచారు. మహారాష్ట్రలో ఆ రాష్ట్ర సీఎంను ఒక్క మాట అన్నందుకే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా బీజేపీ నేతను అరెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. మహారాష్ట్ర సీఎంను ఒక్క మాటన్నందుకే కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిన కోణంలోనే.. ఇక్కడ ఎంపీలను కూడా అరెస్ట్ చేస్తామన్నట్లుగా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
ముందు ఎవరి వంతు
మహారాష్ట్ర సీఎంను ఒక్క మాట అన్నందుకే అంటూ కేటీఆర్ పదేపదే చెప్పిన నేపథ్యంలో.. సీఎంను కాకుండా ఇతరత్రా నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేయొచ్చా అన్న దిశగా సెటైర్లు పడిపోయాయి. అంతేకాకుండా తాను నిర్వహించిన మీడియా సమావేశంలోనే మరి మీ మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా కేటీఆర్ కు ఎదురైంది. దీనిని తనదైన శైలిలో స్పందించిన మా మల్లారెడ్డికి కాస్తంత జోష్ ఎక్కువ అంటూ సమర్థించుకునే యత్నం చేశారు. నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులంటూ పెట్టాల్సి వస్తే.. ముందుగా సభ్యత మరిచి మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై, ఆ తర్వాత మంత్రిగా ఉండి ప్రత్యర్థిపైకి తొడగొట్టిన మల్లారెడ్డిలపై కేసులు పెట్టాలి కదా అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. హద్దు మీరితే అరెస్టులే అన్నట్లుగా ఇన్డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ ను ఆత్మ రక్షణలో పడేసేవేనన్న వాదన వినిపిస్తోంది.
Must Read ;- రేవంత్ దెబ్బకు సోనియా శరణువేడారే