మాజీ మంత్రి ఈటల కుటుంబాన్ని భూ కబ్జా ఆరోపణలు వెంటాడుతున్నాయి.తాజాగా ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్రెడ్డి తమ భూమిని ఆక్రమించారని ఓ వ్యక్తి సీఎం కేసీఆర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా పరిధిలో అచ్చంపేట,హకీంపేట ప్రాంతాల్లో,దేవరయాంజిల్ సమీపంలో దేవాదాయ శాఖకు చెందిన భూములు,అసైన్డ్ భూములు ఆక్రమించారనే ఆరోపణలను కారణంగా చూపుతూ ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి విషయం తెలిసిందే.మంత్రి వర్గం నుంచి బర్తరప్ అయ్యాక ఈటల కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు రాజకీయ పోరాటం వైపు అడుగులేస్తున్నారు.ఈ తరుణంలో ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించి మరో భూకబ్జా ఆరోపణలు వచ్చాయి.

ఈ సారి మేడ్చల్ మండలంలో..
మేడ్చల్ మండల పరిధిలోని రావలకోల్ గ్రామానికి చెందిన పిట్లం మహేష్ ముదిరాజ్ ఈటల కుమారుడైన ఈటల నితిన్ రెడ్డిపై సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశాడు.సర్వే నెంబర్ 77లో సుమారు 10.11 ఎకరాల భూమి ఉందని,1954 నుంచి ఖాస్రా పహాణీలో తన తాత పేరుతోనే ఉందని,1975-76లో భూపరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం) ప్రభుత్వం అప్పట్లో తన తాత పిట్లం నరసింహానికి ఆ భూమి ఇచ్చింది.భూ బదలాయింపును ధృవీకరిస్తూ ప్రభుత్వం గతంలో ధృవపత్రం కూడా జారీ చేసిందని మహేష్ ముదిరాజ్ చెప్పాడు.అయితే ఈ భూమికి సంబంధించిన రికార్డులను కొందరు బలవంతంగా లాక్కుని చించివేశారని మహేష్ ముదిరాజ్ ఆరోపించారు.1986లో అప్పటి సత్యం కంపెనీ అధినేత సత్యం రామలింగరాజు,తదితర ప్రముఖుల పేర్లతో పహాణీలు నమోదయ్యాయని,అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు.రెవెన్యూ అధికారులకు తాము పలుమార్లు విన్నవించామని,అయితే తరువాతి కాలంలో ఇనాం భూమిగా పత్రాలు సృష్టించి భూములను తమ పేరుతో మార్చుకున్నారని ఆరోపించారు.ఇందులో భాగంగా తన తాత నరసింహం పేరుతో ఉన్న భూములను ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్ రెడ్డితోపాటు సాదా కేశవరెడ్డి పేరు మీదకు మార్చుకున్నారని,తాను గతంలో అభ్యంతరం చెప్పడంతో తనను కారులో తీసుకెళ్లి బెదిరించారని,చిత్ర హింసలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.మంత్రిగా ఉన్న సమయంలో తాను ఈ విషయాన్ని చెప్పేందుకు ఈటలను కలిశానని చెప్పారు.ముదిరాజ్ సామాజిక వర్గానికే చెందిన ఈటల రాజేందర్ ముదిరాజ్ బిడ్డలకు న్యాయం చేస్తారని భావించానని,అయితే తనపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మరోసారి తన వద్దకు రావద్దని చెప్పారన్నారు.ఈ మేరకు సీఎంతోపాటు సీఎస్కూ లేఖ రాశారు.మే18న జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
కాగా గతంలో అచ్చంపేట భూముల ఆక్రమణ ఫిర్యాదు విషయంలో అధికారులు 24 గంటల్లో సర్వే చేసి ఈటలపై వచ్చిన ఫిర్యాదులు,ఈటల కుటుంబానికి సంబంధించిన పౌల్ట్రీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చారు.తరవాతి కాలంలోఈటల ఈ విషయానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అధికారులు చేపట్టిన సర్వేపై న్యాయస్థానం పలు అనుమానాలు వ్యక్తం చేసింది.ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో తాజా ఫిర్యాదుపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Must Read ;- ఆయన కడిగిన ముత్యం : బిడ్డా జాగ్రత్త అంటూ.. గంగులకు ఈటల అనుచరుల వార్నింగ్










