ఒక్క ఏడాది.. కేవలం ఒక్క ఏడాది అవకాశం ఇమ్మంటున్నారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలు. అదేంటీ.. వారిదేగా ప్రభత్వం అనే అనుమానం అందరికీ వస్తుంది. వారు ఈ విన్నపం చేసింది రైతుల కోసం.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 30 రోజుల నుండి గడ్డకట్టించే చలిలో నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు ఈ విన్నపం చేశారు. వ్యవసాయ చట్టాల అమలును కేవలం ఒక్క ఏడాది పరిశీలించమని విన్నవించారు. ఆ తర్వాత కూడా మీకు ఈ చట్టాల వల్ల నష్టం కలుగుతుందని అనిపించినా.. ఎటువంటి ప్రయోజనం లేదనిపించినా.. సవరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మీరంటే మాకెంతో గౌరవం
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ రైతు చట్టాల గురించి మాట్లాడుతూ.. నిరసనలలో పాల్గొన్న రైతులన్నా.. వారి కుటుంబాలన్నా మాకెంతో గౌరవం ఉంది. మీకు నష్టం కలిగించే పని ప్రభుత్వం ఎన్నడూ చేయదు. మీకు ఎటువంటి అనుమానాలున్నా వాటిని అడిగి తెలుసుకోండి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. కాబట్టి రైతులు చర్చలకు ఒప్పుకోవాలని విన్నవించారు. రైతు చట్టాల అమలు చేయడానికి ఒక ఏడాది అవకాశం ఇవ్వండి. ఈ కొత్త చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలు మీరే స్వయంగా తెలుసుకుంటారు. ఆ తర్వాత కూడా మీకు వీటి నష్టం వాటిల్లుతుందని, ప్రయోజనం లేదని అనిపిస్తే.. అప్పుడు వాటిలో ఎలాంటి మార్పులు చేయాలనే వాటి గురించి మళ్లీ చర్చిద్దాం అంటూ చెప్పుకొచ్చారు.
రైతుకు అన్యాయం జరగదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో రైతుకు అన్యాయం జరగడమంటూ ఉండదని చెప్పారు అమిత్ షా. రైతు భూములు భద్రంగా ఉంటాయని, రైతులు స్వేచ్ఛగా బతకచ్చని చెప్పుకొచ్చారు. పంటలకు మద్దతు ధర యథావిధిగా కొనసాగుతాయి.. వాటితోపాటు మండీలకు ఎటువంటి నష్టం వాటిల్లదు.. అన్నీ సజావుగా కొనసాగుతాయి. పైగా ముందుకంటే రైతులు ఎక్కువ లాభపడాలని ఈ చట్టాలు రూపొందించాము. గత ప్రభుత్వంతో పోలిస్తే.. మోడీ ప్రభుత్వంలో రైతులు లాభపడిన విషయం మరవకండి. అలాగే ఇవి కూడా మీకు ప్రయోజనం అందిస్తాయే తప్ప మీకు ఎటువంటి నష్టం కలిగించవని రైతులకు వ్యవసాయ చట్టాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశారు.
Must Read ;- సంపాదకీయం : మోడీజీ.. మీ జిమ్మిక్ పనిచేస్తుందా?