లాక్ డౌన్ టైమ్ లో కేవలం వెబ్ కేమ్స్ , సోషల్ మీడియా టూల్స్ తో ‘సీ యూ సూన్’ అనే థ్రిల్లర్ మూవీతో ఓటీటీ రిలీజ్ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు మలయాళ టాలెంటెడ్ హీరో ఫహద్ ఫాజిల్. అయితే ఈ ఏడాది థియేటర్స్ తెరిచినప్పటికీ.. ఏప్రిల్ నెలలో అతడివి ఏకంగా రెండు థ్రిల్లర్ మూవీస్ ఓటీటీలో విడుదలయ్యాయి. అందులో ఒకటి సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఇరుల్’ అయితే, మరొకటి క్రైమ్ థ్రిల్లర్ ‘జోజి’. ఇందులో ఇరుల్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. జోజి మాత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దృశ్యం2 తర్వాత మలయాళంలో వచ్చిన మరో బెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘జోజి’ అంటున్నారు.
ఇక ఈ నెల 7న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది ‘జోజి’. ఫహద్ ఫాజిల్ తో ‘మహేషిండే ప్రతికారం, తొండిముదలుమ్ ద్రుక్సాక్షియుమ్’ సినిమాలు తీసి .. సూపర్ హిట్స్ కొట్టిన దర్శకుడు, నటుడు దిలీష్ పోతన్ మూడో సినిమాగా జోజిని రూపొందించాడు. విశేషమేంటంటే.. ఇందులో కూడా ఫహద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో జీవించాడు. ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫహద్ ఫాజిల్ ఎంతో ఉత్సాహంతో తదుపరి చిత్రాల్లో నటిస్తున్నాడు. షేక్ స్పియర్ ప్రఖ్యాత నాటకం మెక్బత్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
కథేంటి?
పీకే కుట్టప్పన్ ఒక గ్రామంలో పేరుపొందిన ధనవంతుడు. అతడికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు జోమోన్, రెండో కొడుకు జైసన్, మూడో కొడుకు జోజి. కూతురు పేరు బిన్సీ. ముగ్గురు కొడుకులకు తండ్రి అంటే భయం. ఎవరికి వారు తమ లైఫ్ ను స్వతంత్రంగా లీడ్ చేసుకోవాలనుకుంటారు. అయితే తండ్రి బతికి ఉండగా ఆ పని కుదరదని ఎవరికి వారు బాధపడుతూ ఉంటారు. అందులో పెద్ద కొడుకు జోమోన్ కు మాత్రం తండ్రి మీద కాస్తంత ప్రేమ , గౌరవం ఉంటాయి. కారణం భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు తండ్రి తనకి ఆర్ధికంగా సహాయపడతాడు.
ఒకరోజు కుట్టప్పన్ కు పక్షవాతం వచ్చి పడిపోతాడు. హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. బతకడు అని డాక్టర్లు చెబుతారు. దాంతో వారిలో ఇద్దరు కొడుకులు కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు. ఫ్లాట్ కొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని భావిస్తారు. కానీ అనూహ్యంగా అతడు పక్షవాతం నుంచి కోలుకొని ఇంటికి తిరిగి వస్తాడు. వీల్ చెయిర్ లో కూర్చుని కూడా తన కొడుకుల్ని శాసిస్తూంటాడు. దాంతో జోజి తండ్రి వేసుకొనే మందుల్లో సైనేడ్ కలిపి తండ్రి మరణానికి కారణమవుతాడు. అయితే ఆ పని చేసింది తానే అని మిగతా వారికి తెలియకుండా .. తెలివిగా తప్పించుకుంటూ.. ఒక సీక్రెట్ గేమ్ ఆడతాడు. చివరికి జోజినే హంతకుడని తెలుస్తుందా? లేదా అనేదే మిగతా కథ. జోజిగా ఫహద్ పాజిల్ అద్భుతంగా నటించాడు. మిగిలిన పాత్రల్లోనూ ఎవరికి వారు బాగా నటించారు.
ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ తెలుగులో ‘పుష్ప’ లోనూ, తమిళంలో కమల్ హాసన్ , లోకేష్ కనగరాజ్ విక్రమ్ లోనూ విలన్ గా నటించనుండడం విశేషంగా మారింది. నిజానికి ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని వార్తలొచ్చినా.. ఫైనల్ గా ఫహద్ ఫాజిల్ విలన్ గా ఎంపికయ్యాడని తెలుస్తోంది.