ప్రముఖ మలయాళ సినీ కథా రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండె పోటుతో సోమవారం సాయంత్రం కేరళలోని కోట్టయం ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో సూపర్ హిట్టయిన అంతిమతీర్పు, మాతృదేవోభవ, ఆహుతి లాంటి సినిమాలకు ఒరిజినల్ రైటర్ ఆయనే. ఎయిటీస్ లో మలయాళ ఇండస్ట్రీలో ఆయన రాసిన కథలతో రూపొందిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. మను అంకుల్, అగ్రజన్, తుడర్కథ, అప్పు, అధర్వం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ‘మను అంకుల్’ సినిమాకి ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డ్ దక్కింది.
కేరళలోని ఏటుమానూర్ లో జన్మించిన డెన్నిస్ జోసెఫ్ .. అప్పటి ప్రముఖ మలయాళ విలన్ జోస్ ప్రకాశ్ కు స్వయానా మేనల్లుడు. కట్ కట్ మ్యాగజైన్ లో సబ్ ఎడిటర్ గా తన కెరీర్ ప్రారంభించిన డెన్నిస్.. ఈరన్ సంధ్య అనే మూవీతో స్టోరీ రైటర్ గా మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దాదాపు 46 సినిమాలకు కథ అందించిన డెన్నిస్ జోసెఫ్ మృతి పట్ల పలువురు మాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. ఆయన మరణం మలయాళ ఇండస్ట్రీకి తీరని లోటు.










