బ్రిలియంట్ స్ర్కీన్ ప్లేతో చాలా సహజమైన రీతిలో, చక్కటి డీటెయిలింగ్ తో రూపొందిన ఈ సినిమాకి మార్టిన్ ప్రకాట్ దర్శకుడు. కుంచాకో బోబన్, నిమిషా సజయన్, జోజు జార్జ్ ,జాఫర్ ఇడుక్కి, అనిల్ నెడుమాంగాడ్, వినయ్ ఫోర్ట్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ రోజే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఆద్యంతం మనల్ని కట్టిపడేస్తుంది.
చేయని నేరానికి సామాన్యుడు ఎంత స్ట్రగుల్ అవుతాడో .. అంతకు రెట్టింపు వేదన పోలీసులు కూడా అనుభవిస్తారని ఈ సినిమా చెబుతుంది. అంతేకాదు.. ఓటు బ్యాంక్ రాజకీయం తో ఆ వ్యవహారం ముడిపడితే.. పోలీసులు అందులో ఎలా పావులు గా మారతారో కూడా ఈ సినిమా వివరిస్తుంది.
కథేంటి? :
ప్రవీణ్ (కుంచాకో బోబన్ ) అనే సివిల్ పోలీస్ ఆఫీసర్ .. కొత్త గా ఓ పోలీస్ స్టేషన్ లో జాయిన్ అవుతాడు. అక్కడే సునీత వనితా పోలీస్ గా పనిచేస్తూంటుంది. దళిత్ పార్టీకి చెందిన ఒకడు సునీతను వేధిస్తుంటాడు. వాడి మీద కేసు నడుస్తూంటుంది. ఈ వ్యవహారంలో సునీత సీనియర్ ఆఫీసర్ మనియన్ (జోజు జార్జ్ ) ఇన్వాల్వ్ అవుతాడు. ఒక సంఘటనలో ఆ దళిత్ పార్టీ వాడికి, మనియన్ కు గొడవ జరుగుతుంది. మణియన్ వాడ్ని లాకప్ లో పెడతాడు. అయితే పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ తో వాడ్ని ఎలాంటి చార్జెస్ లేకుండా వదిలేస్తారు. ఒక రోజు రాత్రి ప్రవీణ్, సునీత, మనియన్ ఒక పెళ్ళికి వెళుతూ వస్తూండగా.. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ లో దళిత్ పార్టీకి చెందిన వాడి స్నేహితుల బృందంలో ఒకడు చనిపోతాడు. అప్పుడు బండి డ్రైవ్ చేసింది మనియన్ మేనల్లుడు. యాక్సిడెంట్ చేసిన వెంటనే వాడు పారిపోతాడు. ఈ ముగ్గురూ వాడ్ని కాపాడే ప్రయత్నం చేస్తారు కానీ.. సాధ్యం కాదు. వాడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేయడం మిగతా వారు చూస్తారు. వీరు ముగ్గురూ కావాలనే వాడ్ని యాక్సిడెంట్ చేసి చంపేశారని .. వెంటనే వారిని అరెస్ట్ చేయమని దళిత్ పార్టీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెస్తుంది. రెండు మూడు రోజుల్లో జరగబోయే ఎలెక్షన్స్ లో దళిత్ పార్టీ ఓట్లు ముఖ్యమంత్రికి చాలా కీలకం. అందుకే ఈ ముగ్గురినీ ఫ్రేమ్ చేస్తారు. చేయని నేరానికి అరెస్ట్ అవడం ఇష్టం లేక .. మనియన్ నేతృత్వంలో తప్పించుకొని తిరుగుతారు ముగ్గురూ. చివరికి ఆ ముగ్గురూ పోలీసులకు దొరుకుతారా? లేక తప్పించుకుంటారా? జరిగే పరిణామాలేంటి? అన్నది మిగతా కథ.
ముఖ్యమంత్రికి ఉప ఎన్నికలో గెలవడం ముఖ్యం. దానికోసం ఎలాంటి రాజకీయమైనా చేయాలి. ఆయన తలుచుకుంటే ఎలాంటి గేమ్ అయినా ప్లే చేయగలడు. ఈ పాయింట్ ఇందులో చాలా డీడెయిల్డ్ గా చూపించాడు దర్శకుడు మార్టిన్ ప్రకాట్. కుంచాకో బోబన్ ,నిమిషా సజయన్, జోజు జార్జ్ సహజమైన నటన.. ఈ సినిమాకి హైలైట్. ఎలాంటి బిల్డప్పుల్లేకుండా.. ఎవరి హీరోయిజాన్ని ఫోకస్ చేయకుండా.. ఎవరినీ హీరో అని చెప్పకుండా.. కేవలం కథను అనుసరించే పాత్రల్ని మలిచాడు దర్శకుడు. కథే హీరోగా ఉండే ఇలాంటి సినిమాలు … తెలుగులో అసలు ఆడవు.