ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా నిలదీస్తే బెయిల్ రద్దవుతుందనే సీఎం జగన్మోహన్రెడ్డి మిన్నకుండిపోయారని టీడీపీ ఎంపీ రాంమ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన సీఎం, నేడు కనీసం ఢిల్లీ పెద్దలకు ప్రత్యేక హోదాపై లేఖ కూడా రాయలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా చాలా ముఖ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 28 మంది ఎంపీలను పెట్టుకుని రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.
మీకు అంత లేదు..
మన లేఖల వల్లే దేశమంతా ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పుకుంటున్న సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని రాంమ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. వెనుకబడిన 7 జిల్లాలకు రూ.1800 కోట్ల నిధులు ఆగిపోయాయని, వాటిని సాధించడానికి మీరు ఢిల్లీ పెద్దలను ఎప్పుడైనా అడిగారా అని ఆయన అన్నారు. మీ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి, మీ బెయిల్ రద్దు కాకుండా చూసుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎంపీ రాంమ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్రెడ్డికి ఆస్తులు కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Must Read ;- అక్రమార్కులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి.. జగన్ ?