మాటల దాడులను దాటేసుకుని వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తమ పార్టీ జెండాలు కట్టుకున్న కర్రలతో ఇరువర్గాలు కొట్టుకున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రంగంలోకి దిగగా.. వైసీపీ నుంచి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ బరిలోకి దిగారు. ఇరువురి వెంట పెద్ద సంఖ్యలో రెండు పార్టీల కార్యకర్తలు ప్రత్యక్షంగా దాడులకు తెగబడిన వైనం కలకలం రేపుతోంది. ఈ దాడుల్లో జోగి రమేశ్ కారు అద్దాలు పగిలిపోయాయి. అదే సమయంలో వైసీపీ దాడుల్లో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఇరువర్గాలపై లాఠీలు ఝుళిపించాల్సి వచ్చింది. చివరకు జోగి రమేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మొత్తంగా గంటకు పైగా చంద్రబాబు ఇంటి పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గొడవకు నేపథ్యమిదే..
జగన్ పాలనపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా ఇతర అన్ని విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నాయి. ఇటీవలి కాలంలో వృద్ధాప్య పింఛన్ల కోత, చెప్పాపెట్టకుండానే విద్యుత్ చార్జీల పెంపులతో ఈ విమర్శల దాడి మరింతగా పెరిగింది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం నాడు సీఎం జగన్ ను టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను బాగానే ఇబ్బంది పెట్టినట్టున్నాయి. ఈ వ్యాఖ్యలపై పెడన ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేశ్ ఘాటుగా స్పందించారు. అయ్యన్న ఎన్ని మాటలన్నారో, అంతకంటే నాలుగు మాటలే ఎక్కువగా జోగి రమేశ్ మాట్లాడారు. జోగి రమేశ్ వ్యాఖ్యలపై టీడీపీ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మళ్లీ రంగంలోకి దిగిన జోగి రమేశ్.. టీడీపీ నేతలపైనా, మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జగన్ ను విమర్శించిన వారిని తరిమికొడతామని, చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొడతామని మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబు ఇంటి ముట్టడికి యత్నం
ఈ మాటల దాడులంతా గురువారం జరిగితే.. శుక్రవారం ఉదయమే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు తరలివెళ్లాయి. జోగి రమేశే ఈ శ్రేణులకు నాయకత్వం వహించారు. జోగి రమేశ్ కారులో రాగా.. వైసీపీ శ్రేణులు మాత్రం తమ పార్టీ జెండాలను కట్టిన కర్రలను చేతబట్టుకుని ముట్టడికి కాకుండా దాడులకు వచ్చినట్టుగానే వచ్చారు. అయితే ఈ తరహా పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న టీడీపీ శ్రేణులతో కలిసి అక్కడకు వచ్చారు. వైసీపీ శ్రేణుల చేతుల్లోని కర్రలను చూసిన టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెనక్కు వెళ్లాలంటూ నినాదాలు చేశాయి. అయితే టీడీపీ శ్రేణులపైకి వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. తమ చేతుల్లోని జెండా కర్రలతో దాడికి దిగాయి. ఈ క్రమంలో జోగి కారు అద్దాలు పగిలిపోయాయి. ఓ వైపు బుద్ధా వెంకన్న కార్యకర్తలను అదుపు చేస్తుండగానే.. జోగి రమేశ్ ఆయనపైకి ఎగబడ్డారు. ఎదురెదురుగా నిలిచిన ఇద్దరు నేతలు వేళ్లు చూపించుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఇద్దరు నేతలు పరస్పరం తోసుకున్నారు. ఈలోగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇద్దరు నేతలను సముదాయించే యత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. బుద్ధా, జోగి తోపులాడుకుంటటూ ఉంటే..వైసీపీ శ్రేణులుల కర్రలతో టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడికి దిగాయి. దీంతో టీడీపీ శ్రేణులు కూడా రాళ్ల దాడికి దిగాయి. వెరసి పరిస్థితి చేయి దాటిపోతున్న వైనాన్ని గ్రహించిన పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఇరువర్గాలను తరిమికొట్టారు. ఆ తర్వాత జోగి రమేశ్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్ లో ఎక్కించి అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Must Read ;- జగన్కు రిలీఫ్.. సాక్షిని బుక్ చేసిందే