జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీ ప్రసారం చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి మళ్లీ బూస్టింగ్ అవసరమైనట్టుంది. ఎవరైనా సెలబ్రిటీలు హాట్ సీటులో ఆశీనులైనప్పుడు షోకి హైప్ వస్తోంది. అందుకే ట్రిపుల్ దర్శకుడు రాజమౌళిని హాట్ సీటులో కూర్చోబెట్టే ప్రయత్నాన్ని జూనియర్ ఎన్టీఆర్ చేశారు. అంతేకాదు ‘ఆచార్య’ దర్శకుడు కొరటాలను కూడా ఈ షోకి ఆహ్వానించారు.
ఈ షోకి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ రాగానే నిర్వాహకులు అలెర్ట్ అయ్యారు. ఇద్దరు గెస్ట్ లను ఎన్టీఆర్ ముందు కూర్చోబెట్టి ఎవరెంత గెలుచుకోబోతున్నారో చూడాలంటూ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. దీని ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నెల 20వ తేదీన ఇది ప్రసారం కాబోతోంది. ఈ ఇద్దరూ ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన వారే. రాజమౌళితో ఎన్టీఆర్ ప్రయాణం స్టూడెంట్ నంబర్ వన్ తో ప్రారంభమై ట్రిపుల్ ఆర్ వరకూ కొనసాగింది. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.
ఇక కొరటాల శివతో ఇంతకుముందు జనతా గ్యారేజ్ చేశారు. అది మంచి హిట్ సాధించింది. ఎన్టీఆర్ హీరోగా నటించే 30 వ చిత్రానికి కొరటాల దర్శకత్వం వహించనున్నారు. ఈ షో మీద ఆసక్తి పెంచేందుకే ఈ అగ్రదర్శకులను అతిథులుగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ట్రిపుల్ ఆర్ లో మరో హీరో రామ్ చరణ్ ను ఎన్టీఆర్ హాట్ సీటులో కూర్చోబెట్టారు. ఇప్పుడు దర్శక దిగ్గజాలనున బరిలోకి దించారు. ఇది ఎలా ఉంటుందో చూడాలి.
Must Read ;- పవన్ వెర్సెస్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ వార్ లో విన్నర్ ఎవరు?











