కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారత్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరణాలు కూడా అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే థర్డ్ వేవ్పై అంచనాలు ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్ ప్రాధాన్య అంశంగా మారింది. కొవిడ్ 19కి సంబంధించి తాజాగా మరో వేరియంట్ వచ్చిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న డెల్టా వేరియంట్ రూపు మార్చుకున్న ఈ కొత్త స్ట్రెయిన్ను ‘డెల్టా ప్లస్’ లేదా ఏవై.1 పేరుతో పిలుస్తున్నారు.
భారత్లో తక్కువే..
ప్రస్తుతానికి ఈ వైరస్ ఉనికి భారత్లో తక్కువే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరప్ ,అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయని, అక్కడ అందుబాటులో ఉన్న కొన్ని వ్యాక్సిన్లతో పాటు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ కూడా ఆ వైరస్పై ప్రభావం చూపలేకపోతోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పటికే కొవిడ్ -19లో బి.1.617.2 వేరియంట్ దేశంలో తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ను డెల్టా పేరుతో పిలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్లో ఈ కేసులు విపరీతంగా ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఈ ‘డెల్టా’ వైరస్ తోనే మరో మ్యూటెంట్ జరిగి కె417ఎన్ అనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందని, దీన్ని బి.1.617.2.1 అని, డెల్టా ప్లస్ అని చెబుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB-Delhi) శాస్త్రవేత్త వినోద్ స్కారియా మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఈ కేసులు ఎక్కువగా లేవని వ్యాఖ్యానించారు. అయితే శరీరంలోని ప్రొటీన్ని ఈ వైరస్ ఎక్కువగా ఉప యోగించుకుని ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు.
భారత్లో ఏడు కేసులు నమోదు
ప్రపంచవ్యాప్తంగా 62 మందిలో ‘డెల్టా ప్లస్’ ఉన్నట్లు తేలిందని, భారత్లో ఏడు కేసులు నమోదయ్యాయయని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్’ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని, అయితే కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీలు ఈ వేరియంట్పై ప్రభావం చూపలేకపోతున్నాయనే ఆధారాలున్నాయని తేల్చింది. కాగా ఈ వేరియంట్కి సంబంధించి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, మన దేశంలో పెద్దగా కేసులు లేవని ప్రముఖ ఇమ్యునాలజిస్టు వినీతా బాల్ వ్యాఖ్యానించారు. రోగ నిరోధక వ్యవస్థ ఈ వేరియంట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తేలాల్సి ఉందని, వ్యాక్సిన్ వేయించుకున్న వారి నమూనాలూ, ప్లాస్మాను సేకరించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో శాస్త్రవేత్త అనురాగ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఈ కొత్త వేరియంట్కి సంబంధించి గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డాటా (GISAID)కూడా హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద కొవిడ్ -19లో కొత్త వేరియంట్లతో పాటు సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిన నేపథ్యంలో కొత్త వేరియంట్ల వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే థర్డ్ వేవ్ పై అంచనాలున్న నేపథ్యంలో ఈ డెల్టా ప్లస్ వేరియంట్పై పలు మేగజైన్లు వార్తలు ప్రచురించడం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పవచ్చు.
Must Read ;- రెండు డోసుల మధ్య వ్యవధి ఎంత.. వ్యాక్సిన్ల విరామంపై మరోసారి వివాదం