నటీనటులను ఆరాధించడంలో తమిళనాడుదే అగ్రపీఠం. నటులను వీరు తమ గుండెల్లో పెట్టుకోవడమే కాదు ఏకంగా గుడులే కట్టిస్తారు. ఒకనాటి మేటి నటుడు ఎంజీఆర్ కు అక్కడ గుడి కట్టించారు. ఆ తర్వాత హీరోయిన్లలో నటి ఖుష్బూకు గుడి కట్టించడం ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నమిత, హన్సిక, నయనతార లాంటి తారలకు కూడా ఇక్కడ అలాగే చేశారు. తాజాగా ఈ జాబితాలోకి నిధి అగర్వాల్ కూడా చేరింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఆమెకు గుడి కట్టి అందులో విగ్రహం పెట్టి దానికి పాలాభిషేకం కూడా ఆమె అభిమానులు చేశారు.
ఈ విషయం తెలిసి నిధి అగర్వాల్ ఆశ్చర్యపోయింది. ఆమె తమిళంలో నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యాయి. ఓటీటీలో భూమి చిత్రం, ఈశ్వరన్ చిత్రం థియేటర్లలోనూ విడుదలయ్యాయి. ఆమె హైదరాబాద్ లో జన్మిచినా బెంగళూరులో పెరిగింది. హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’ ద్వారా నటిగా ఆమె కెరీర్ ప్రారంభమైంది. తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘సవ్యసాచి’ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’లోనూ నటించింది.
ప్రేమికుల రోజు సందర్భంగా తమిళనాడులోని ఓ చోట కట్టిన గుడిలో ఆమె విగ్రహానికి అభిమానులు పాలాభిషేకం చేయడం, ఈ ఫొటోలు నెట్టింట్ వైరల్ అవడం జరిగింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం కూడా వచ్చింది. తనకు అభిమానులు గుడి కట్టిన విషయంపై నిధి అగర్వాల్ మాట్లాడుతూ అభిమానుల నుంచి ఇంత ప్రేమను తాను ఊహించలేదని అంది. వారి ప్రేమను జన్మజన్మలకూ గుర్తుపెట్టుకుంటానంది.
‘నేనింకా కొత్తదాన్నే. తమిళంలో కేవలం రెండే రెండు సినిమాలు చేశాను. తెలుగులో చేస్తున్నాను. ఈ విషయం తెలిసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అధికారికంగా అభిమాన సంఘం కూడా లేదు. అభిమానులను సోషల్ మీడియాలోనే కలుస్తుంటాను. నేను ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చిన్న పిల్లల కోసం, కుక్కల సంరక్షణ కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పాను. కానీ వారు నాకోసం చిన్న పిల్లలకు అన్నదానం చేస్తున్నారు. జంతు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నేను కచ్చితంగా ఇలాంటి అభిమానులను ప్రోత్సహిస్తాను’ అని వివరించింది. ఉదయనిధి స్టాలిన్ తోనూ ఓ సినిమా చేస్తున్నట్టు చెప్పింది. మాగిజ్ తిరుమేని సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలను అంగీకరించినట్టు తెలిపింది. మొత్తానికి కెరీర్ తొలి రోజుల్లోనే మధురానుభూతుల్ని మిగుల్చుకుంటోంది.
Must Read ;- ప్రేమంటే ఇదేరా అంటున్న ముద్దుగుమ్మలు











