No Support To YSRCP Social Media Wing From The Party :
2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిందంటే.. అది ఆ పార్టీ గొప్పతనమేమీ కాదనే చెప్పాలి. ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా తనదైన శైలిలో విజృంభించడంతోనే ఆ పార్టీకి విజయం దక్కిందని చెప్పాలి. వైసీపీ అధిష్ఠానం ఎన్ని ప్రణాళికలు రచించినా, ఆ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ ఎన్ని వ్యూహాలు రూపొందించినా.. వాటిని జనం వద్దకు తీసుకెళ్లింది మాత్రం వైసీపీ సోషల్ మీడియానే. అంతేనా.. ప్రత్యర్థి పార్టీ టీడీపీపైనా తనదైన శైలిలో పోస్టులతో రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా.. చంద్రబాబు ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగేలా చేసింది. చంద్రబాబు సర్కారు చేసిన మంచిని దాచేసి.. చేయని పనులను హైలెట్ చేసి టీడీపీపై బ్లేమ్ గేమ్ సాగించింది. వెరసి టీడీపీ బలహీనపడగా.. వైసీపీ బలపడింది. ఎన్నికల్లో ఇదే పనిచేసింది. మొత్తంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి, వైసీపీ గెలుపునకు వైసీపీ సోషల్ మీడియానే కారణమని చెప్పక తప్పదు. మరి అలాంటి సోషల్ మీడియా బృందాన్ని ఎలా కాపాడుకోవాలి? అసలు ఇప్పుడు వైసీపీ ఆ వింగ్ ను పట్టించుకుంటోందా? ఆ వింగ్ సభ్యులు అరెస్టై జైల్లో కూర్చుంటే కనీసం న్యాయ సాయమన్నా చేస్తోందా? అంటే.. లేదనే చెప్పాలి. ఫలితంగా వైసీపీని గద్దెనెక్కించిన ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ సభ్యులు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
న్యాయ వ్యవస్థపైనే కామెంట్లా?
తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ధీమాతో వైసీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యులు.. ఇకపై తమ జీవితాలు మారినట్టేనని భావించారు. ఇక తమకు తిరుగే లేదన్న రీతిలో వ్యవహరించడం మొదలెట్టేశారు. అందుకు పార్టీ పెద్దలు కూడా సోషల్ మీడియా వింగ్ సభ్యులకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా కలరింగ్ ఇచ్చిరు. ఇంకేముంది.. వైసీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యులు పట్టపగ్గాల్లేకుండా సాగారు. ఈ క్రమంలో తమ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలనే నిలువరిస్తారా? అంటూ ఏకంగా న్యాయ వ్యవస్థపై పడిపోయారు. హైకోర్టులో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై వరుసగా వ్యతిరేక తీర్పులు రావడంతో హైకోర్టు న్యాయమూర్తులను టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ యాక్టివిస్టులు ఏకంగా వారిని దునుమాడుతూ సంచలన పోస్ట్ లను పెట్టారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్ సర్కారు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయక తప్పలేదు. తమను ఎప్పుతూ ఇరికించేస్తున్న సీఐడీకే ఈ కేసు దర్యాప్తును అప్పగించారు. అయితే అన్ని కేసుల్లాగే ఈ కేసునూ సీఐడీ జాప్యం చేస్తూ వచ్చింది. మరోమారు హైకోర్టు జోక్యం చేసుకుని కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ పరిణామంతో అటు వైసీపీతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా షాక్ కు గురయ్యాయి.
విదేశాల్లోని వారినీ రప్పిస్తారట
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను తీసుకున్న సీబీఐ.. తనదైన శైలి దూకుడుతో సాగింది. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి జాబితాను తీసిన సీబీఐ ఏకంగా 13 మందిపై కేసు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే జగన్ సొంత జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖరరెడ్డి, దామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్ లను అరెస్ట్ చేసింది. వీరిలో తొలి ఇద్దరు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. సుధీర్ మాత్రం సీబీఐ కస్టడీలో ఉన్నాడు. ఇక న్యాయ వ్యవస్థకు సీబీఐ సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఈ కేసులోనూ కదలిక వచ్చింది. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పట్టపు ఆదర్శ, లావనూరు సాంబశివారెడ్డిలను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. గుంటూరు కోర్టు వీరిద్దరినీ రిమాండ్ కు ఆదేశించింది. తాజా అరెస్ట్ లతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది. కేసు నమోదు చేసిన 13 మందిలో ఇప్పటికే 11 మందిని విచారించిన సీబీఐ ఐదుగురిని అరెస్ట్ చేసింది. మిగిలిన వారికి సంబంధించి మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు చేస్తోంది. ఇక విదేశాల్లో ఉన్న ముగ్గురిని రప్పించేందుకు చర్యలు మొదలుపెట్టింది.
పార్టీ నుంచి నో సపోర్ట్
ఇదంతా బాగానే ఉన్నా.. వైసీపీ విజయానికి అవిశ్రాంతంగా కృషి చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు ప్రత్యర్ధి వర్గానికి చెందిన వర్గాలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలను ఈ వింగ్ తిప్పికొడుతోంది. అయితే అలాంటి వింగ్ కు ఇప్పుడు వైసీపీ నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదట. అరెస్టైన వారి ముఖం కూడా చూసేందుకు వైసీపీ పెద్దలు నిరాకరిస్తున్నారట. న్యాయ పరమైన సాయం కూడా అందించేందుకు పార్టీ సిద్ధంగా లేదట. అరెస్టైన వారి కుటుంబాలు పదే పదే పార్టీ పెద్దలను కలిసినా కూడా ఫలితం లేదట. ఈ కేసులో అరెస్టైన లింగారెడ్డి రాజశేఖరరెడ్డి అరెస్ట్ తర్వాత అతడికి న్యాయ సాయం చేసేందుకు వైసీపీ పెద్దలు ససేమిరా అన్నారట. కనీసం న్యాయవాది సేవలను అందించేందుకు కూడా పార్టీ నిరాకరించిందట. విచారణ సందర్భంగా కూడా వారికి న్యాయవాదులను పంపించడం లేదట. మొత్తంగా తమకు విజయాన్ని అందించిన సోషల్ మీడియా వింగ్ కు చెందిన కీలక సభ్యులు కష్టాల్లో ఉంటే.. వారికి అండాదండగా నిలవాల్సిన వైసీపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందట. అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలను ఖండించేందుకు ప్రభుత్వం తరఫున డిజిటల్ వింగ్ ఉందని, ఇక తమకు సోషల్ మీడియా యాక్టివిస్టుల అవసరమేమిటని కూడా పార్టీ కీలక నేతలు ప్రశ్నిస్తున్నారట.
Must Read ;- ముందు నుయ్యి.. వెనుక గొయ్యి











