ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక ప్రచారం జోరుగా జరుగుతోంది .. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడనేది ఆ ప్రచారంలో సారాంశం. ఇటీవలే పవన్ కల్యాణ్ ను కలిసిన పూరి జగన్నాథ్ ఆయనకి ఆ కథను వినిపించడం .. వెంటనే ఆయన గ్రీన్ సింగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ విషయాన్ని గురించే ఫిల్మ్ నగర్లోని కుర్రాళ్లంతా చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ స్టైల్ ను .. ఆయన నుంచి అభిమానులు ఆశిస్తున్న అంశాలను పూరి అయితేనే కరెక్ట్ గా తెరపై చూపించగలడని చెప్పుకుంటున్నారు.
పూరి జగన్నాథ్ .. పవన్ కల్యాణ్ హీరోగా ‘బద్రి’ సినిమాతోనే దర్శకుడిగా తన కెరియర్ ను ఆరంభించాడు. ఈ సినిమా యూత్ లోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. పవన్ స్టైల్ ను కుర్రకారు హృదయాల్లకి మోసుకుపోయింది. ఆ తరువాత పూరి ఎన్ని సినిమాలు చేసినా, పవన్ ఎన్ని సినిమాలు చేసినా, ‘బద్రి’ సినిమాకిగల ప్రత్యేకత అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాను గురించి కుర్రాళ్లు మాట్లాడుకుంటూనే ఉంటారంటే, వాళ్లను ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా తరువాత ఒక పుష్క్రర కాలానికి మళ్లీ ‘కెమెరామెన్ గంగంతో రాంబాబు’ సినిమా చేశారు. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకుల మనసులను గెలవ లేకపోయింది. మళ్లీ ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇది కొత్త కథని కొంతమంది అంటుంటే, ఆల్రెడీ ఇంతకుముందు మహేశ్ బాబుకి వినిపించిన ‘జన గణ మన’ కథేనని మరికొంతమంది అంటున్నారు. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన సినిమాలు పూర్తికాగానే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Must Read ;- మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సందడి చేయనున్న పవర్ స్టార్