పాములపర్తి వెంకట నరసింహారావు… తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు. కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను.. తన సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి… ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిన చాణక్యుడు.. స్వాతంత్య్రోద్యమకారుడు, రాజనీతిజ్ఞుడు, మృదుస్వభావి, కవి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘనతలు అందుకున్న తెలుగుతేజం మన పీవీ. నేడు ఆయన శత జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులు, మేధావులు, ఉన్నత విద్యావంతులు, రాజకీయ నాయకులు, మంత్రులు ఘన నివాళులు అర్పించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి : వెంకయ్య నాయుడు
పీవీ శత జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీని కీర్తిస్తూ ట్వీట్ చేశారు. ‘‘భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి శ్రీ మన పీవీ. ‘స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరచిన పీవీ, మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారు’’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
పీవీ సేవలు చిరస్మరణీయం : మోడీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పీవీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమని, దేశాభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని మోదీ అన్నారు.
ఎంత స్మరించినా.. తక్కువే : కేసీఆర్
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖరం. పరిపూర్ణమైన సంస్కరణ శీలి అని అన్నారు. పీవీ మార్గ్లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఆర్థిక సంస్కరణల ఘనత ఆయనదే : హరీశ్ రావు
ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత పీవీదేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. శతజయంతి సందర్భంగా మన పీవీని ఘనంగా స్మరించుకుందామన్నారు. ‘‘ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం’’ అని ట్వీట్ చేశారు.
బహుభాషా కోవిదులు : కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పీవీని స్మరించుకున్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడని అన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ గారి జయంతి సందర్భంగా ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. నేటి యువత పీవీని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
Must Read ;- అన్ సంగ్ హీరో పీవీ!