నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం, అనంతరం జరిగిన పరిణామాలు, న్యాయస్థానాల తీర్పులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అదే సమయంలో తన తండ్రిపై సీఐడీ కస్టడీలో దాడి జరిగిందని, దీనిపై సీబీఐతో విచారణ చేయాలని చెబుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ సుప్రీంను ఆశ్రయించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు షరతులతో కూడిన బెయిల్ లభించింది. అయితే ఎంపీ రఘురామరాజు బయటకు వచ్చిన తరవాత మరో కోణంలో లీగల్ పోరాటం మొదలు పెట్టారు.
సీఐడీ డీజీ సునిల్ కుమార్కు లీగల్ నోటీసు..
తన ఐ ఫోన్ సీఐడీ వాళ్లు స్వాధీనం చేసుకున్నారని, తిరిగి ఇవ్వాలని చెబుతూ సీఐడీ డీజీ సునిల్ కుమార్కు లీగల్ నోటీసు జారీ చేశారు.అంతేగాక దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ కస్టడీలో తనపై దాడి జరిగిందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెబుతూ ఎంపీలకు లేఖ రాశారు. ఇప్పటికే తన అరెస్టు విషయంలో అమానుషంగా వ్యవహరించారని లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక ఎంపీలకు లేఖ రాసిన నేపథ్యంలో కొందరు ఎంపీలు ఇప్పటికే స్పందించారు. తాను మాట్లాడేందుకు లోక్సభలో 20నిమిషాల పాటు సమయం ఇవ్వాల్సందిగా కోరారు ఎంపీ రఘురామరాజు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపారనే అభిప్రాయం నెలకొంది.
టీవీ9, సాక్షి టీవీలకు నోటీసులు..
ఇక తాజాగా తన అరెస్టుతో పాటు కోర్టులో కేసు విచారణ ఉన్న సమయంలో, తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు సంబంధించిన వార్తలు ఏయే ఛానెళ్లలో ఎలా వచ్చాయనే అంశంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే టీవీ9కు, సాక్షి టీవీలకు లీగల్ నోటీసులు పంపించారు.టీవీ9లోని డైరక్టరు, సీఈఓతో పాటు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మురళీ కృష్ణ పేర్లను ఈ నోటీసులో ప్రస్తావించారు. (సాక్షిటీవీ) ఇందిర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్ పర్సన్, ఏపీ సీఎం జగన్ భార్య వై ఎస్ భారతి రెడ్డి, బోర్డు డైరెక్టర్లకు, చీఫ్ ఎడిటర్ నీమని భాస్కర్, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు లీగల్ నోటీసులు పంపారు. అయితే టీవీ9కు, సాక్షి టీవీలకు రఘురామరాజు లీగల్ నోటీసులు జారీ చేయడంతో మీడియాలో మరో చర్చ మొదైలైంది. రఘురామరాజు అరెస్టు సమయంలో పత్రికలు, టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు పలు వార్తలను ప్రసారం చేశాయి. అయితే వాటిలో వైసీపీకి అనుకూలంగా ఉండే సొంత ఛానెల్, పత్రికతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో రఘురామరాజును పర్సనల్గా టార్గెట్ చేసినట్టు ఆయన వర్గం ఇప్పటికే భావిస్తున్న తరుణంలో వాటిపై కూడా చర్యలుంటాయా అనే చర్చ నడుస్తోంది. వైసీపీ సొంత మీడియాతో పాటు మరో ముఖ్య ఛానెల్ పేరు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. రఘురామరాజును టార్గెట్ చేసి పలు ఆరోపణలను ఆపాదిస్తూ వార్తలు, స్టోరీలు ప్రసారం చేసిన సదరు ఛానెల్ వీడియోలను ఇప్పటికే RRR వర్గం, అభిమానులు డౌన్ లోడ్ చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు. కాగా రఘురామరాజు అరెస్టుకు ముందే ఓ యూట్యూబ్ ఛానెల్, ఓ వెబ్ సైట్ పై డైరెక్ట్గా కామెంట్ చేశారు. వైసీపీ స్పాన్సర్ యూట్యూబ్ ఛానెల్ కావడంతో రఘురామరాజు ఘాటుగానే వ్యాఖ్యానించారు. రఘురామరాజుపై పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లు, మెయిన్ స్ట్రీం మీడియా కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో మొత్తం అన్నింటిపైనా ఒకే సారి లీగల్ యాక్షన్కు దిగుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో కోర్టులో కేసు విచారణలో ఉండగానే, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం కావడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీవీ9కు, సాక్షి టీవీలకు లీగల్ నోటీసులు జారీ కావడంపై చర్చ నడుస్తోంది.
Must Read ;- మరో వివాదంలో సీఐడీ.. రఘురామరాజు ఫోన్ నుంచి మాజీ సలహాదారుకు మెసేజ్లు











