నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు టీవీ9పై పరువునష్టం దావా వేస్తూ లీగల్ నోటీసు పంపారు. మే14న రఘురామకృష్ణరాజు అరెస్టు సందర్భంగా టీవీ9లో వచ్చిన కథనాలు, చర్చల్లో భాగంగా టీవీ9లో ప్రజెంటర్లు వినియోగించిన భాష తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ నోటీసులు పంపారు. నోటీసులు అందిన వారం రోజుల్లోగా షరతులు లేని క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బోర్డు డైరక్టర్లలో ఒకరైన జె.జగపతిరావు, సీఈఓ బరుణ్ దాస్, మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజనీకాంత్ , ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ మురళీ కృష్ణల పేర్లు ఈ నోటీసులో పేర్కొన్నారు. టీవీ9లో టెలీకాస్ట్ అయి యూట్యూబ్లో అప్ లోడ్ చేసిన URLలతో సహా పలు కథనాల్లో ఏయే సమయాల్లో తన క్లయింట్ పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే అంశాన్ని వివరంగా పేర్కొన్నారు.
మీ ఛానెల్లోనూ తప్పుడు ప్రచారం..
ఈ నోటీసులో ‘నా క్లయింట్ పారిశ్రామిక వేత్తగా, పార్లమెంటు సభ్యుడిగా సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తి. పలు రాష్ట్రాల్లో వేలాది మందికి తమ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 31,909 ఓట్లతో గెలుపొంది ఎంపీ అయ్యారు. పేదల అభ్యున్నతి కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాజీపడని పోరాటం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో ఉన్నారు. 7ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. అంతకంటే ఎక్కువే ప్రజలతో ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం రచ్చబండ కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. రఘురామకృష్ణరాజుకు వస్తున్న పేరు ప్రఖ్యాతులను తట్టుకోలేక పార్టీలో కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేశారు. మీ ఛానెల్లోనూ ఆ తప్పుడు ప్రచారం చేశారు. పరువుకు నష్టం కలిగించారు.
వ్యంగంతో కూడిన వ్యాఖ్యలు..
RRR అరెస్టుపై CBI EX Jd Laxminarayana శీర్షికతో ప్రసారమైన వార్తా విశ్లేషణ కార్యక్రమంలో నా క్లయింట్ అరెస్టుకు సంబంధించి ఎపిసోడ్ ప్రజెంటర్ రజనీకాంత్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇదే వీడియోలో వ్యంగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సభ్యుడి అరెస్టుకు సంబంధించిన అంశంలో పార్లమెంటు సభ్యుడికి ప్రత్యేక రక్షణ/హక్కు/హోదా ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ అంశంపై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు..
RRR అరెస్ట్: ఇద్ది పెద్ద కుట్ర.. దీని వెనుక చాలామంది ఉన్నారు: Ponnavolu sudhakar Reddy-tv9 శీర్షికతో మే 17న ప్రసారమైన వార్తాంశం (వీడియో)లోని 28.30 పాయింట్లో అడిషనల్ అడ్వొకట్ జనరల్ (AAG) పొన్నవోలు సుధాకర్రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అడ్డుకునేందుకు ప్రజెంటర్ రజనీకాంత్ అడ్డుకునే యత్నం చేయలేదు. కోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.ఇదే వీడియోలో 2.22 నిమిషం వద్ద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరో వార్తలో ycp mp Raghu Ram krishnam Raju sent to 14Days Judicial Remand శీర్షికతో వీడియో ప్రసారం చేశారు. ఈ వీడియోలో నా క్లయింట్ కులాల మధ్య విభేదాలు పెట్టే ప్రయత్నం చేశారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఇదే వీడియోలో రఘురామకృష్ణరాజు వీడియోలను స్క్రీన్ పై చూపిస్తూ ఈ హావభావాలు,ఈ వెటకారమే RRRని ఇబ్బందుల్లోకి నెట్టాయి అనే వీడియో కూడా ప్రసారం చేశారు. మే 17న మరో వీడియోలో RRR వెనుక చంద్రబాబు అనే శీర్షికతో ప్రసారం చేశారు.
కాలికి గాయమైన అంశానికి సంబంధించి కూడా..
ఇవే కాకుండా కాలికి గాయమైన అంశానికి సంబంధించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా గర్భిణులకు మాత్రమే అలాంటి సమస్య వస్తుందని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన నారాచంద్రబాబు నాయుడితో సంబంధాలున్నాయని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డితో కూడా ఈ వీడియోలో నిరాధార ఆరోపణలు చేయించారు.
మరో వీడియోలో నా క్లయింట్ రఘురామకృష్ణరాజు అరెస్టు విషయాన్ని లైవ్లో చూపిస్తూ డైజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ని ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాల్లేకుండా తప్పుడు వార్తను ప్రసారం చేశారు. నా క్లయింట్ పరువుకు నష్టం కలిగేలా వ్యవహరించారు. ఇక కీలకం కానున్న మెడికల్ బోర్డు నివేదిక శీర్షికతో మే 16 ప్రసారమైన వీడియోలో నా క్లయింట్ సొరియాసిస్తో బాధపడుతున్నారని చెప్పారు. కోర్టు విచారణలో ఉన్న కేసులో పరువు నష్టం వ్యాఖ్యలే కాకుండా పాలనా పరమైన విషయంలోనూ జోక్యం చేసుకున్నారు. ఇక రఘురామ కేసులో ఊహించని ట్విస్ట్ వీడియోలోనూ పలు వ్యాఖ్యలు చేశారు. నాక్లయింట్ పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించారు. ’ అని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. వివిధ సెక్షన్లతో పాటు ఇలాంటి కేసులకు సంబంధించి గతంలో వివిధ న్యాయస్థానాల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ 12పేజీల నోటీసు జారీ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 499, 500 లను ప్రస్తావించారు. వివిధ సెక్షన్లను ప్రస్తావిస్తూ నోటీసులు జారీ అయిన వారంలోగా భేషరతు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పని పక్షంలో తరువాతి న్యాయపరమైన చర్యలకు బాధ్యులవుతారని నోటీసులో పేర్కొన్నారు.
Must Read ;- మరో వివాదంలో సీఐడీ.. రఘురామరాజు ఫోన్ నుంచి మాజీ సలహాదారుకు మెసేజ్లు











