ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో మరో కొత్త వివాదం తలెత్తింది.శుక్ర, శనివారాల్లో ఇందుకు సంబంధించి కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. తన అరెస్టు తరువాత పోలీసులు తన ఐ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని,తిరిగి తనకు అప్పగించలేదని చెబుతూ ఏపీ సీఐడీ డీజీ సునిల్ కుమార్కు రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసు పంపారు. తాజాగా గురువారం ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు డా.పీవీ రమేష్ సంచలన ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో ‘ తనకు, తన కుటుంబ సభ్యులకు +91 90009 11111 నెంబరు నుంచి వాట్సాప్ మెస్సేజ్లు వస్తున్నాయని, అన్ లిస్టెడ్ నెంబరుగా ఉన్న సదరు నెంబరు రఘురామకృష్ణరాజుది అని, ప్రజా ప్రయోజనార్థం ఈ విషయం బయటపెడుతున్నానని,ఎంపీ స్పందించాలి’ అని డా.పీవీ రమేష్ ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణరాజు తన ఫోన్ ద్వారా మే14 నుంచి తాను ఎవరికీ, ఎలాంటి మెస్సేజ్ పంపలేదని తెలిపారు. మే 14న తన ఫోన్ను ఏపీ సీఐడీ పోలీసులు సీజ్ చేశారని, ఇప్పటికీ ఆ ఫోన్ వారి వద్దే ఉందని వ్యాఖ్యానించారు.నాలుగు రోజుల క్రితం సిమ్ బ్లాక్ చేయించానని,కొత్త సిమ్ కార్డు తీసుకున్నానని తెలిపారు.తన ఫోన్ తిరిగి అప్పగించాల్సిందిగా న్యాయపరమైన చర్యలకు సంబంధించి నిన్న లీగల్ నోటీసు పంపించానని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, తన ఫోన్ దుర్వినియోగానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు ట్వీట్పై స్పందించిన పీవీ రమేష్ ఈ అంశంపై క్లారిఫికేషన్ ఇచ్చిందుకు ధన్యవాదాలు చెబుతూ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని రిప్లై ఇచ్చారు.
ఫోన్ అప్పగించాలంటూ సీఐడీ అడిషినల్ డీజీకి లీగల్ నోటీసు
కాగా తన ఐ ఫోన్ను మే14న తనను అరెస్టు చేసిన సమయంలో సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని,తనకు ఇప్పటికీ తిరిగివ్వలేదని,తన ఫోన్ అప్పగించాలని చెబుతూ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అడిషినల్ డీజీకి లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే.తన ఫోన్లో విలువైన సమాచారం ఉందని, స్టాండింగ్ కమిటీ సభ్యుడినని, పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు తన ఫోన్ అప్పగించాలని, తన అరెస్టు సమయంలో తన దగ్గర తీసుకున్న వస్తువులు మెజిస్ట్రేట్ వద్ద సమర్పించాలని కోరారు. కాగా తన ఐఫోన్ను ఓపెన్ చేయాలని కస్టడీలో తనను హింసించినట్టు రఘురామకృష్ణరాజు ఆరోపించిన విషయం తెలిసిందే.
మాజీ సలహాదారుకు మెసేజ్ల మతలబు ఏమిటో..
ఇక ప్రభుత్వ మాజీ సలహాదారు పీవీ రమేష్కు రఘురామకృష్ణరాజు మొబైల్ నుంచి వాట్సప్ మెస్సేజ్లు వెళ్లడంపైనా చర్చ నడుస్తోంది. పీవీ రమేష్కు వచ్చిన మెస్సేజ్లలో ఏముందనే విషయం బయటకు రానప్పటికీ రఘురామకృష్ణరాజుకి సంబంధించి సీఐడీ వద్ద ఉన్న ఫోన్ నుంచి వెళ్లాయా లేదా సిమ్ క్లోనింగ్ ఏమైనా జరిగిందా అనే చర్చ కూడ నడుస్తోంది. పీవీ రమేష్కి ఎందుకు మెస్సేజ్లు వెళ్లాయి, అందుకు సంబంధించి కారణాలేమైనా ఉన్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం పీవీ రమేష్ మాజీ సలహాదారుగా ఉన్నారు. గతంలో ఏడాదిపాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నా పదవీ కాలం ముగియడంతో తప్పుకున్నారు. మరోసారి కొనసాగాలని ప్రతిపాదన వచ్చినా పీవీ రమేష్ తనకు తానుగా తప్పుకున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పీవీ రమేష్కు వచ్చిన వాట్సాప్ మెస్సేజ్ల వెనుక ఎవరున్నారనేది తేలాల్సి ఉంది. ఫేక్ నెంబరును క్రియేట్ చేసి చేశారా, లేక రఘురామకృష్ణరాజు ఆరోపించిన ప్రకారం సీఐడీ వద్ద ఉన్న ఫోన్ నుంచే మెస్సేజ్లు వెళ్లాయా లేక మరేదైనా కారణం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఇదే అంశంపై తనకు తెలియకుండా తన ఫోన్ నుంచి మెస్సేజ్ పంపించి భావ ప్రకటన స్చేచ్చ, ప్రైవసీ హక్కులకు భంగం వాటిల్లిందనే కారణంతో రఘురామకృష్ణరాజు మరో పోరాటం మొదలు పెట్ట వచ్చనే చర్చ కూడా నడుస్తోంది.
Must Read ;- టీవీ9కు రఘురామరాజు లీగల్ నోటీస్